24 గంటలపాటు పెట్రోల్ పంపుల బంద్...తీవ్ర ఇబ్బందుల్లో వాహనదారులు
మూలిగే నక్కపై తాటికాయి పడ్డట్టు అయ్యింది సామాన్యుడి పరిస్థితి. అసలే పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యుడి పరిస్థితి భారంగా మారగా... దీనికి తోడు పెట్రోల్ పంపులు బంద్ కావడంతో వారి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. ఢిల్లీలో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మరోవైపు ఢిల్లీలోని ఆటో రిక్షాలు, టాక్సీలు స్ట్రైక్కు దిగాయి. దీంతో ఢిల్లీ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు.
'మి టూ'కు కౌంటర్గా 'మెన్ టూ'ను ప్రారంభించిన బెంగళూరువాసులు, ఫ్రాన్స్ మాజీ రాయబారి కూడా
దేశ రాజధాని ఢిల్లీలోని 400 వరకు ఉన్న పెట్రోల్ బంకులు మూతబడ్డాయి. 24 గంటల పాటు పెట్రోల్ పంపులు బంద్కు పిలుపునిచ్చాయి యాజమాన్యాలు. ఢిల్లీ సర్కార్ వ్యాట్ పెంచడంతో వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ బంకు యాజమాన్యాలు పెట్రోల్ పంపులను మూసివేశాయి. మరోవైపు ఢిల్లీ సర్కార్ ఆటో-టాక్సీలపై తీసుకుంటున్న నిర్ణయాలపై నిరసన తెలుపుతూ ఆటో-టాక్సీ యూనియన్ సంయుక్త్ సంఘర్ష్ సమితి ఒకరోజు బంద్కు పిలుపునిచ్చింది. దీంతో అటు పెట్రోల్ బంకులు మూతపడి..ఇటు ఆటోలు టాక్సీల బంద్తో ఢిల్లీ వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసుకు వెళ్లేవారు చాలా ఇబ్బంది పడ్డారు.
పెట్రోలు డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ వారి డిమాండ్ను పెడచెవిన పెడుతోందని ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నిశ్చల్ సింఘానియా తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించడంతో ఢిల్లీ వాసులు అక్కడికెళ్లి ఇంధనం తెచ్చుకుంటున్నారని దీంతో ఢిల్లీలోని 30శాతం పెట్రోలు పంపులకు నష్టం వాటిల్లుతోందని ధ్వజమెత్తారు.
ఢిల్లీతో పోలిస్తే యూపీలో లీటరు పెట్రోలు రూ. 2.59, హర్యానాలో రూ.1.95 తక్కువగా వస్తోంది. లీటర్ డీజిల్ ఢిల్లీతో పోలిస్తే యూపీలో రూ.2.02, హర్యానాలో రూ.1.72 తక్కవగా లభిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో తక్కువగా పెట్రోల్ లభిస్తుండటంతో పైగా ఢిల్లీకి పొరుగు రాష్ట్రాలు కావడంతో ఢిల్లీ వాసులు యూపీ, హర్యానాలకు వెళ్లి పెట్రోల్ పట్టించుకువస్తున్నారని సింఘానియా ఆవేదన వ్యక్తం చేశారు. నగర వాసులు యూపీ, హర్యానాలకు వెళ్లి పెట్రోల్ తెచ్చుకోవడం వల్ల ఢిల్లీలోని వాతావరణం పెద్ద ఎత్తున్న కాలుష్యంతో నిండిపోతోందని సింఘానియా తెలిపారు. ఒక్క ఢిల్లీలో దొరికే ఇంధనంకే యూరో సిక్స్ విలువ ఉందని చెప్పారు. ఈ తరహా ఇంధనం వినియోగంతో 80శాతం కార్బన్ కారకాలు గాల్లోకి విడుదల కావడం తగ్గిపోతాయని వెల్లడించారు.
ఇదిలా ఉంటే పెట్రోల్ పంపు బంద్ బీజేపీ చేయిస్తున్న నాటకమని ధ్వజమెత్తారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ బంద్ వెనకాల బీజేపీ హస్తముందని స్వయంగా పెట్రోల్ పంపు యజమానులే తమతో చెప్పినట్లు కేజ్రీవాల్ చెప్పారు. పదే పదే ప్రజలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.