ఉద్యోగుల కులం,మతం,నియోజకవర్గం వివరాలు తెలపండి : కేంద్రం
దేశ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపుల్లో పనిచేస్తున్న 10 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం అంటే కులం, మతం, నియోజకవర్గంలాంటివి వెంటనే తెలపాలని కేంద్ర ఇంధనం మరియు సహజ గ్యాస్ మంత్రిత్వ శాఖ పెట్రోల్ బంకు డీలర్లను ఆదేశించింది. ఈ సమాచారం నైపుణ్యత అభివృద్ధి కార్యక్రమంకోసమే ఉద్దేశించబడిందని కేంద్రం తెలిపింది. కేంద్రం ఇలాంటి ఆదేశాలు జారీచేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు పెట్రోల్ బంకు డీలర్లు. వ్యక్తిగత సమాచారం అడగటం రాజ్యాంగ విరుద్ధమని వారు చెబుతున్నారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని డీలర్లు చెబుతున్నారు.
మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్న 59వేల పెట్రోల్ పంపుల డీలర్లకు లేఖలు రాశాయి. అక్కడ పెట్రోల్ పంపుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు ఇవ్వాలని కోరాయి. ఈ వివరాలు ఇస్తే వారికి ఒక సర్టిఫేకేట్ అందజేయడం జరుగుతుందని తెలిపింది. హైడ్రోకార్బన్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఈ సర్టిఫికేట్ ఇస్తుందని తెలిపింది. దీని ద్వారా వారు క్వాలిఫైడ్ ఉద్యోగులుగా పరిగణించబడుతారని భవిష్యత్తులో వారికి ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుందని చెప్పింది.
ఆధార్ సంఖ్య, మతం, కులం, నియోజకవర్గంకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఎంప్లాయిస్ ఇవ్వాల్సిందిగా ఆయిల్ సంస్థలు కోరాయి. ఇలాంటి వ్యక్తిగత సమాచారం యాజమాన్యం, ఉద్యోగుల మధ్యే ఉండాలని బయటకు రాకూడదని కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్ల జనరల్ సెక్రటరీ సురేష్ కుమార్ చెప్పారు. ఒక ఉద్యోగికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం బహిర్గతం చేయకూడదు కాబట్టి వారి వివరాలేవీ ఇవ్వలేమని ఆయిల్ కంపెనీలకు లేఖ రాసినట్లు సురేష్ తెలిపారు.
పెట్రోల్ పంపుల్లో పనిచేసే ఉద్యోగుల సమాచారం ఇవ్వకుంటే అట్టి పెట్రోల్ పంపులకు ఆయిల్ సప్లై నిలిపివేస్తామని ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు బెదిరిస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. పెట్రోల్ పంపుకు ఆయిల్ సప్లై నిలిపివేస్తున్నామని ఈమెయిల్ ద్వారా లేఖ పంపడంతో పంజాబ్ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్కు లీగల్ నోటీసులు పంపింది.