సిమి, పీఎఫ్ఐలపై నిషేధం: అమిత్ షాదే తుది నిర్ణయం: యోగి డిమాండ్ పట్ల సానుకూలం..!
న్యూఢిల్లీ: స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా (సిమి), పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)లను నిషేధం విధించే విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖదే తుది నిర్ణయమని కేంద్ర న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ రెండు సంస్థలను నిషేధించాలని కోరుతూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు అందాయని, దీనిపై తమ ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
పౌరసత్వ సరవణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకున్న అల్లర్లు, హింసాత్మక పరిస్థితుల వెనుక సిమి, పీఎఫ్ఐ కార్యకర్తల ప్రమేయం ఉందని, స్థానికులను రెచ్చగొట్టి మరీ.. వారు ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేయించినట్లు ఉత్తర ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రెండింటిపైనా నిషేధం విధించాలని కోరుతూ రూపొందించిన ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర హోంశాఖకు పంపించింది.
దీనిపై రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాజధాని లక్నో సహా బులంద్ షహర్, బహ్రాయిచ్, ఘజియాబాద్, సంభాల్, మొరాదాబాద్, గోరఖ్ పూర్ వంటి జిల్లాల్లో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితుల వెనుక సిమి, పీఎఫ్ఐల హస్తం ఉన్నట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సాక్ష్యాధారాలతో కూడిన ప్రతిపాదనలను పంపించిందని ఆయన అన్నారు. నిరసన ప్రదర్శనల ముసుగులో ప్రభుత్వ ఆస్తులను విధ్వంసానికి కుట్ర పన్నిన వారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పదని చెప్పారు.
సిమిపై కొన్ని రాష్ట్రల్లో ఇప్పటికే నిషేధం ఉందని, దీన్ని ఉత్తర ప్రదేశ్ లోనూ అమలు చేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర హోం మంత్రిత్వ శాఖపై ఉందని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించే సిమి, పీఎఫ్ఐ వంటి సంస్థలను నిషేధిత జాబితాలో చేర్చాలని తాను కోరుకుంటున్నానని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అల్లర్లను ప్రోత్సహించే ఏ సంస్థనైనా నిషేధం వేటు వేయాల్సిన ఉంటుందని అన్నారు.