ప్యూన్ ఉద్యోగానికి పీహెచ్డీలు దరఖాస్తు చేశారు!
లక్నో: యువత తాము చదివిన చదువుకు తగిన ఉద్యోగాలు దొరక్కపోవడంతో బంట్రోతు ఉద్యోగానికి సైతం ఉన్నత చదివినా దరఖాస్తు చేస్తున్నారు. నిరుద్యోగం పెరిగిపోవడంతో ఏదైతేనేం ప్రభుత్వం కొలువేగా అన్న దోరణితో ఉన్నత విద్యావంతులు చిన్న ఉద్యోగానికైనా పోటీపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇది మరీ ఎక్కువగా ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన బంట్రోతు(ప్యూన్) ఉద్యోగ ప్రకటనకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులేమో 23 లక్షలు. ఉన్నవి కేవలం 368 ఉద్యోగాలే కావడం గమనార్హం. ఇదే చిత్రమనుకుంటే.. వీటికి దరఖాస్తు చేసుకున్నవారిలో డిగ్రీ ఉత్తీర్ణులు, పీజీ చదివినవాళ్లే కాదు, పీహెచ్డీ చేసినవాళ్లు కూడా ఉన్నారు.
కాగా, ఈ బంట్రోతు ఉద్యోగానికి కనీస అర్హతగా ఐదో తరగతి చదివి, సైకిల్ తొక్కటం వచ్చి ఉంటే చాలని నిర్ణయించారు. తమకు అందిన దరఖాస్తులను విద్యార్హతల ప్రకారం వర్గీకరించగా.. 255 మంది పీహెచ్డీ పూర్తిచేసినవాళ్లు ఉండటం ఆశ్చర్యం కలిగించిందని సచివాలయ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
అలాగే డిగ్రీ పూర్తిచేసినవాళ్లు 1.5 లక్షల మంది, పీజీ ఉత్తీర్ణులు 24,969 మంది ఉన్నారనీ వివరించారు.
ఇది ఇలా ఉండగా, నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పడుతున్న దీన్ని అవకాశంగా తీసుకున్న ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై మూకుమ్మడిగా దాడి చేశాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఎస్పీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోవటంపై విమర్శలు గుప్పించాయి.