రజనీ పార్టీతో కమల్ ఎన్నికల పొత్తు -తోడుగా మజ్లిస్ -ఎంజీఆర్ ఆశిస్సు -డీఎంకే అనూహ్య స్పందన
అసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలల ముందే తమిళనాడులో రాజకీయం వేడెక్కింది. దాదాపు అన్ని పార్టీలూ ముందస్తు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. తాను కూడా కొత్త పార్టీతో ఎన్నికల బరిలోకి దిగుతానని రజనీకాంత్ సెలవిచ్చారు. ఇందుకు సంబంధించి జనవరి 1న పూర్తి వివరాలు వెల్లడిస్తానని సూపర్ స్టార్ తెలిపారు. ఈ క్రమంలో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మజ్లిస్ పార్టీతో చర్చలకు సిద్ధమైన కమల్.. తాజాగా రజనీ పార్టీపైనా కామెంట్లు చేయడంపై డీఎంకే అనూహ్యంగా స్పందించింది.
జగన్కు కేశినేని శ్వేత వార్నింగ్ -సునామీని తట్టుకోగలరా? -సీఎం ఇంట్లో సూట్ కేసులు -అమరావతి పోరు
కమల్ రోడ్ షో..
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద పార్టీలకు దీటుగా నిలవాలనుకుంటోన్న ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ ఆరు నెలల ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. విరుదునగర్ జిల్లా కేంద్రంలోకమల్ మంగళవారం రోడ్ షో నిర్వహించారు. దీనికి భారీ ఎత్తున స్పందన వచ్చింది. కరోనా కాలంలోనూ వందలాది మంది కమల్ వాహనాన్ని అనుసరించారు. అదే ఉత్సాహంతో కమల్ సైతం మీడియాను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రజనీ, ఎంజీఆర్ లపై కీలక వ్యాఖ్యలు చేశారు..
రజనీతో పొత్తుకు సిద్ధం..
‘‘నేను, రజనీకాంత్ ఇద్దరం మార్పు కోరుకునేవాళ్లమే. తమిళనాడు కోసం రజనీతో కలిసి పని చేసేందుకు నేను సిద్ధం. మా ఇరువురి మధ్య భావసారూప్యత లేకపోయినా తమిళ ప్రజల కోసం కలిసి పనిచేసేందుకు నేను సిద్ధం. మా పొత్తు ఖరారు కావడానికి ఒక్క ఫోన్ కాల్ చాలు. అయితే రజనీ తన పార్టీని ప్రకటించి, ఎంఎన్ఎంతో పోత్తుపై నిర్ణయం తీసుకునేదాకా మేం ఎదురుచూస్తాం'' అని కమల్ అన్నారు. రజనీ కాంత్ పెట్టబోయే పార్టీతో ఎన్నికల పొత్తు గురించి ఇప్పుడప్పుడే ఆలోచించలేదన్న 24 గంటల వ్యవధిలోనే కమల్ పొత్తుకు సిద్ధమని చెప్పడం గమనార్హం. ఇప్పటికే..
అటు అసద్.. ఇటు రజనీ..
2021లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ పోటీ చేయనుందని, కమల్ హాసన్ ఎంఎన్ఎంతో మజ్లిస్ పొత్తుపెట్టుకోనుందని, మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న వెల్లూర్, రాణీపేట్, తిరపత్తూర్, క్రిష్టగిరి, రామనాథపురం, పుదుకొట్టై, ట్రిచి, ముధురై, తిరునల్వేలి జిల్లాల్లోని కనీసం 25 నియోజకవర్గాల్లో బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలురాగా, వాటిని ఆయా పార్టీలు ఖండించలేదు. ఒకవైపు అసద్, మరోవైపు రజనీ అండగా తమిళనాడ చక్రం తిప్పొచ్చని కమల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు..
ఎంజీఆర్ ఆ పార్టీ సొత్తుకాదు
విరుదునగర్ రోడ్ షోలో ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ మాట్లాడుతూ దివంగత ఎంజీఆర్ పేరును తలుచుకున్నారు. ఎంజీఆర్ ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క వ్యక్తికో సొంతం కాదని కమల్ అన్నారు. ఎంజీఆర్ రాజకీయ ప్రస్థానం ఆరంభిచిన డీఎంకేకో, సొంతగా పెట్టుకున్న ఏఐఏడీఎంకే పార్టీకో చెందిన వ్యక్తి మాత్రమే కాబోరని, ప్రజా నాయకుడైన ఎంజీఆర్ అందరివాడని పేర్కొన్నారు. తాను ఎంజీఆర్ అడుగుజాడల్లోనే పెరిగానని, దివంగత నేత ఆశీస్సులు ఉంటాయని కమల్ చెప్పుకొచ్చారు. దీనిపై..
రజనీ-కమల్ పొత్తుపై డీఎంకే ఎద్దేవా
ఇంకా ఖరారుకాని రజనీకాంత్ -కమల్ హాసన్ పార్టీల ఎన్నికల పొత్తు వ్యవహారంపై తమిళనాట హాట్ హాట్ చర్చ నడుస్తోంది. కమల్ కామెంట్లపై డీఎంకే కీలక నేత ఇళంగోవన్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో 1949 నుంచి ఎన్నెన్నో ప్రాంతీయ పార్టీలు, అనేక రాజకీయ పొత్తులు పుట్టి, వాటికవే కనుమరుగై పోయాయని, కొత్తగా పుట్టుకొచ్చే ఏ కూటమితోనూ డీఎంకేకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, అయితే, అన్నాడీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓటులో కొంత శాతాన్ని దక్కించుకోవడం తప్ప మిగతా పార్టీలు సాధించేది ఏమీ ఉండదని ఇళంగోవన్ అన్నారు.