‘బహిరంగ మలవిసర్జన చేస్తున్న వారి ఫొటో పంపిస్తే రూ.100 బహుమతి’
స్వచ్ఛ భారత్ ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లా యంత్రాంంగం చేపట్టిన ఓ వినూత్న కార్యక్రమం విమర్శలకు దారితీసింది. అదేంటంటే..
భోపాల్: స్వచ్ఛ భారత్ ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లా యంత్రాంంగం చేపట్టిన ఓ వినూత్న కార్యక్రమం విమర్శలకు దారితీసింది. అదేంటంటే.. జిల్లా పరిధిలో ఎవరైనా బహిరంగ మలవిసర్జన చేస్తున్నట్లు కనిపిస్తే వారి ఫొటో తీసి, వాట్సప్ ద్వారా జిల్లా పరిశుభ్రత విభాగానికి పంపించాలని కోరింది.
అలా చేస్తే ఆ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టి రూ.250 జరిమానా విధించి, ఫొటో పంపిన వారికి రూ.100 బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. ఈ ఏడాది విడుదలైన భారత టాప్ 100 స్వచ్ఛ నగరాల్లో గ్వాలియర్ 27వ స్థానంలో ఉంది.
ఆ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవడానికి స్థానిక అధికార యంత్రాంగం ఇలాంటి ప్రయోగానికి సిద్ధమవడం గమనార్హం. అయితే, ఇలా చేయడం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, వెంటనే పద్ధతిని నిలిపివేయాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
విమర్శలు ఎక్కువగా రావడంతో.. తమకు వచ్చిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ కాకుండా చూస్తామని జిల్లా యంత్రాంగం చెప్పడం గమనార్హం. అయినా, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం కన్నా.. ప్రజల్లో అవగాహన కల్పించి, వారిని టెయ్లెట్లు నిర్మించుకునేలా సహకరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.