కదిలిస్తే కన్నీటి సుడిగుండాలే.. పుట్టెడు దు:ఖంలోనూ రైతు ఆందోళనల్లో వితంతువులు,తల్లులు...
అది ఢిల్లీ-హర్యానా బోర్డర్ టిక్రీ... భారతీయ కిసాన్ యూనియన్(ఉగ్రహన్) అక్కడొక ప్రత్యేక నిరసన స్టేజ్ను ఏర్పాటు చేసింది. అక్కడ నిరసన తెలియజేస్తున్న చాలామంది మహిళలు రైతులైన తమ భర్తలను కోల్పోయిన వితంతువులు,కొడుకులను కోల్పోయిన తల్లులు. చేతుల్లో తమవాళ్ల ఫోటోలను పట్టుకుని కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వారు నినదిస్తున్నారు. వాళ్లలో ఎవరినీ కదిలించినా మనసును కన్నీటి సుడిగుండాలే అలుముకుంటాయి.
రైతాంగ దీక్షలపై సుప్రీంకోర్టు ఆగ్రహం: కీలక ఆదేశాలు జారీ: నోటీసులు: రైతు సంఘాల ఇంప్లీడ్
ఉన్న రెండెకరాలు అమ్ముకున్నాం : జస్బీర్ కౌర్
జస్బీర్ కౌర్(56).. పంజాబ్లోని సంగరూర్ జిల్లా కకర్వాల్ గ్రామానికి చెందిన మహిళ. ప్రస్తుతం టిక్రీ బోర్డర్ వద్ద రైతు ఆందోళనల్లోపాల్గొంటున్నారు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక 2015లో ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. 'ఆయన చనిపోయిన రోజే మా జీవితాలు ఆగిపోయాయి. ఆ తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. ఉన్న రెండెకరాల భూమిని అమ్ముకోవాల్సి వచ్చింది. 16 ఏళ్ల నా కొడుకు ఇప్పుడు వేరే వాళ్ల పొలంలో పనికి వెళ్తున్నాడు. నేనింకా రూ.4లక్షలు అప్పు తీర్చాల్సి ఉంది.' అని జస్బీర్ కౌర్ వాపోయారు.
పదేళ్ల క్రితం కోడలి ఆత్మహత్య.. : హర్దీప్ కౌర్
హర్దీప్ కౌర్(70).. పంజాబ్లోని ఉగ్రహాన్కి చెందిన వృద్దురాలు. ఈ వయసులోనే ఆమె రైతు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. 'మా ఇల్లు మొత్తం కోడలి కష్టార్జితం పైనే ఆధారపడి బతికేది. మా ఆయన,కొడుకు ఇద్దరు అనారోగ్యంతో మంచాన పడ్డాక... కోడలే కుటుంబ భారాన్ని ఆమె భుజాలపై వేసుకుంది. కానీ వ్యవసాయంలో నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయి పదేళ్ల క్రితం ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో మాకు రూ.6లక్షలు అప్పు ఉంది. ఇప్పటికీ ఆ అప్పు ఇంకా మిగిలే ఉంది. మాకొచ్చే ఆదాయంతో ఇప్పటికీ ఆ అప్పును చెల్లించలేకపోతున్నాం.' అని హర్దీప్ కౌర్ వాపోయింది.
ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య.. : సర్జీత్ కౌర్
సర్జీత్ కౌర్(60).. పంజాబ్కి చెందిన ఈ మహిళ కొడుకు 28 ఏళ్ల వయసులో 2010లో ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయం కోసం చేసిన రూ.10లక్షలు అప్పు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. 'తను మాకున్న ఒక్కగానొక్క కొడుకు. ఉన్న మూడెకరాల భూమిని అమ్మేసినా ఇప్పటికీ అప్పు తీరలేదు. ఇప్పుడు నేను,నా భర్త మా పక్కవాళ్ల పొలంలో పనిచేస్తున్నాం. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాలతో రైతుల ఆదాయం మరింత పడిపోతుంది. నాలాగే ఎంతోమంది తల్లుల కొడుకులను ఆత్మహత్యలకు పురిగొల్పుతుంది. మేము అనుభవిస్తున్న బాధ మరొకరికి రావొద్దని కోరుకుంటున్నాం.' అని సర్జీత్ కౌర్ కన్నీటిపర్యంతమయ్యారు.
అప్పులు... నెమ్మదిగా మృత్యువును చేరడమే..
మహీందర్ కౌర్(55) అనే మరో పంజాబ్ మహిళను కదిలించగా... 2015లో తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. వ్యవసాయం కోసం చేసిన రూ.5లక్షలు అప్పు చెల్లించలేక అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ అప్పు రూ.15లక్షలకు పెరిగిందని... తానూ ఆత్మహత్య చేసుకుని తన పిల్లలను ఒంటరిని చేయలేనని వాపోయారు. కానీ ఇలా అప్పుల్లో కూరుకుపోయిన జీవితాలు నెమ్మదిగా మృత్యువును చేరుకోవడం లాంటివే...' అని ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video
2019లో 10వేల మంది ఆత్మహత్యలు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 2019లో దాదాపు 10,281 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందులో 5,957 మంది సాగుదారులు కాగా 4,324 మంది వ్యవసాయ కూలీలు. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం ఆత్మహత్య ఘటనల్లో రైతు ఆత్మహత్యలు 7.5శాతం కావడం గమనార్హం. భారతీయ కిసాన్ యూనియన్ హర్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ... అప్పుల కారణంగా తమవాళ్లను కోల్పోయినవారందరినీ ఆందోళనల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పరిస్థితులు మరింత దిగజారి దేశంలో ఆత్మహత్యలు మరింతగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.