సుప్రీం తీర్పు: సగర్వంగా... హిజ్రాల ఆనందం (పిక్చర్స్)
న్యూఢిల్లీ: సమాజంలో హిజ్రాలను థర్డ్ జెండర్గా గుర్తించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హిజ్రాలకు ప్రత్యేక హక్కులను కల్పించి, వారి సంక్షేమానికి తగు చర్యలు తీసుకోవాలని సుప్రీం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన విషయం తెలిసిందే.
వీరిని మూడో జాతి (థర్డ్ జండర్)గా గుర్తించాలని చారిత్రక తీర్పు ఇచ్చింది. లింగ మార్పిడి చేయించుకున్న వారిని (ట్రాన్స్ జెండర్స్) ఇతర వెనుకబడిన వర్గాలు (ఒబిసి)గా గుర్తించాలని, వారికి విద్య, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని, వైద్య సౌకర్యం అందుబాటులోకి తేవాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
హిజ్రాలు గతంలో తమ గురించి వివరాలు తెలియజేసినపుడు నిర్బంధంగా పురుషులు లేదా మహిళలు అని రాయాల్సి వచ్చేది. కోర్టు నిర్ణయం మేరకు వీరిని సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా పరిగణించాలి. మూడో జాతిగా గుర్తించి అన్ని రంగాల్లోనూ అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది.
హిజ్రాలు
ప్రత్యేక హక్కులు ఇవ్వకుంటే హిజ్రాల పట్ల ఇంకా వివక్ష చూపినట్లే అవుతుందని న్యాయస్థానం అభిప్రాయ పడింది. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా వీరి కోసం ప్రత్యేక పథకాలను అమలు చేయాలని కూడా ఆదేశించింది. వీరికి ప్రత్యేకంగా టాయిలెట్లు ఏర్పాటు చేసి, అన్ని ప్రభుత్వ శాఖలు వైద్యపరంగా సహాయం అందించాల్సి ఉంటుంది.
హిజ్రాలు
ఒకప్పుడు హిజ్రాల పట్ల గౌరవ భావం ఉండేదని, ఆ తర్వాత సమాజం వీరి పట్ల వివక్ష చూపడం ప్రారంభించినట్లు సుప్రీం కోర్టు భావించింది. భారత శిక్షాస్మృతిలోని 377 సెక్షన్ను వీరి పట్ల పోలీసులు దుర్వినియోగ పరుస్తున్నారనే ఆరోపణలున్నాయి.
హిజ్రాలు
జాతీయ న్యాయ సర్వీసుల ప్రాథికార సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపాక కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. మానవ హక్కులను గుర్తిస్తూ ఇలా కోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని హిజ్రాల హక్కుల కార్యకర్త లక్ష్మీనారాయణ్ త్రిపాఠి పేర్కొన్నారు. సుప్రీం తీర్పు పట్ల ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ కూడా హర్షం ప్రకటించింది.
హిజ్రాలు
కొతీ, అరవాణి, జోగప్ప, శివ శక్తి, కొజ్జా తదితర పేర్లతో పిలిచే హిజ్రాలు ఎదుర్కొంటున్న వివక్ష అనూహ్యమని, వారు కూడా ఈ దేశ పౌరులని, స్త్రీ, పురుషులకు ఉన్నట్లే రాజ్యాంగం ప్రకారం వారికి హక్కులుంటాయని, వాటిని పరిరక్షించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎకె సిక్రీతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
హిజ్రాలు
దురదృష్టవశాత్తు మన దేశంలో హిజ్రాల హక్కులపై చట్టం లేదని, అందుకే వారు ప్రతిచోట వివక్ష ఎదుర్కొంటున్నారని, అందువల్ల భారత్ కూడా భాగమైన వివిధ అందర్జాతీయ ఒప్పందాలను అనుసరించాల్సిన అవసరం ఉందని, పలు దేశాల్లో హిజ్రాల హక్కులను గుర్తించాలని న్యాయస్థానం పేర్కొంది.
హిజ్రాలు
సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో మహారాష్ట్ర రాజధాని ముంబయితో పాటు పలు ప్రాంతాల్లోని హిజ్రాలు సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు తినిపించుకున్నారు.