ఇక ‘పిడకల’నూ ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చు!
న్యూఢిల్లీ: ప్రతీ వస్తువును ఆన్లైన్ ద్వారానే అందించేందుకు ప్రయత్నిస్తున్న ఈ కామర్స్ దిగ్గజాలు .. ఇప్పుడు పండగల సందర్భంగా ఉపయోగించే పిడకలను సైతం అమ్మేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు పండగల సీజన్లో ఫోన్లు, బట్టలు, గృహోపకరణాలు, టపాసులే అందించిన ఆన్లైన్ స్టోర్లు.. ఇప్పుడు పిడకలను అమ్మేస్తున్నాయి.
కొన్ని ఈ కామర్స్ సైట్లు ఇప్పటికే ఈ పని మొదలుపెట్టాయి. హిందూ సంప్రదాయం ప్రకారం పిడకలను నవరాత్రి పూజల్లో, దీపావళి రోజున ఉపయోగిస్తారు. ఇందుకోసం అమెజాన్, షాప్క్లూస్, హోంషాప్18, బిగ్ బాస్కెట్ లాంటి ఆన్లైన్ సంస్థలు పూజా సామాగ్రితోపాటు పిడకలను కూడా అమ్మకానికి పెట్టాయి.
అంతేగాక, వీటిపై భారీ డిస్కౌంట్లు ప్రకటించడం గమనార్హం. ఈ రోజుల్లో పట్టణాల్లో పిడకలు దొరకడం చాలా కష్టమని, అందుకే తాము ఆన్లైన్లో అమ్మకాలు చేస్తున్నట్లు సంస్థలు చెబుతున్నాయి. పట్టణ ప్రజలు నుంచి వీటికి మంచి ఆదరణ లభిస్తోందంటున్నాయి ఈ ఆన్లైన్ షాపింగ్ సంస్థలు.
కాగా, పిడకలను 4, 11, 24 చొప్పున ప్యాకెట్లలో అమ్ముతున్నారు. ఓ సైట్లో 4 పిడకల ప్యాకెట్ ధరను రూ. 40, 24 పిడకల ధర రూ. 150గా నిర్ణయించారు.