కేజ్రీవాల్కు షాక్: రోహిత్ సోదరుడికి ఉద్యోగంపై కోర్టుకు
ఢిల్లీ: రోహిత్ వేముల సోదరుడికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఉద్యోగం ఇవ్వడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఇది దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో రోహిత్ వేముల సోదరుడు వేముల రాజా చైతన్య కుమార్కు ఢిల్లీ ప్రభుత్వం 'గ్రూప్ సి' ఉద్యోగం ఇచ్చింది. దీనిపై లాయర్ అవద్ కౌషిక్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఫిబ్రవరి 23వ తేదీన ఢిల్లీ కేబినెట్ ఓ నిర్ణయం తీసుకుందని, మార్చి 3వ తేదీ నుంచి రోహిత్ సోదరుడికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారని, ఇది సరికాదని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగం అన్యాయం, అక్రమం, ఏకపక్షం, రాజకీయ పరమైన నిర్ణయమని అందులో పేర్కొన్నారు.
కేబినెట్ చెప్పిన ప్రకారం.. రోహిత్ వేముల సోదరుడు.. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉద్యోగం కావాలని కోరాడని ఉందని, కానీ రోహిత్ కుటుంబం నుంచి అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని పిటిషన్లో పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణయం సరికాదన్నారు.
ఇలా ఉద్యోగం ఇవ్వడం సరికాదన్నారు. మెరిట్ పైన ఉద్యోగం సాధించాలనుకునే ఢిల్లీ యువతకు కూడా నష్టమని అభిప్రాయపడ్డారు. దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. మే 17వ తేదీన విచారణకు రానుంది. రోహిత్ వేముల మృతి అనంతరం ఏఏపీ, కాంగ్రెస్ పార్టీ దానిని రాజకీయాలకు వాడుకున్నారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.