ఆ విషయంలో సీజేఐ ఏకపక్ష నిర్ణయాలు వద్దు: సుప్రీంలో సంచలన పిటిషన్
న్యూఢిల్లీ: 'మాస్టర్ ఆఫ్ రోస్టర్'గా భారత ప్రధాన న్యాయమూర్తి అధికారాలు పూర్తిగా ఒక్కరికే పరిమితం కాకూడదని కోరుతూ మాజీ న్యాయశాఖ మంత్రి, సీనియర్ అడ్వకేట్ శాంతిభూషణ్ శుక్రవారం సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా 2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆయన ప్రస్తావించారు. సుప్రీం కోర్టులోని ఇతర బెంచ్ లలో ఉన్న న్యాయమూర్తులకు కేసులను కేటాయించే విధానంలో పారదర్శకత అవసరమని అందులో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు.
'చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా' అంటే సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలిజీయంగా భావించాల్సి ఉంటుందని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. కేసుల కేటాయింపుకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి ఏకపక్ష నిర్ణయాలు ఉండరాదని, దీనిపై కొలీజయంకే నిర్ణయాధికారం ఉండాలని ఆయన చెప్పారు.
సుప్రీం చరిత్రలోనే తొలిసారిగా నలుగురు సీనియర్ జడ్జిలు.. ప్రెస్మీట్ పెట్టి మరీ కోర్టులో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సంచలనం రేపిన రెండు నెలలకే ఈ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.
'మాస్టర్ ఆఫ్ రోస్టర్'గా ప్రధాన న్యాయమూర్తి అధికారాలపై స్పష్టత ఇవ్వాలని, కేసుల కేటాయింపు విషయంలో రోస్టర్ ప్రతిపాదనలను, సూచనలను పక్కన పెట్టడంపై కూడా వివరణ ఇవ్వాలని ఆమె కోరారు. ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే ఏకపక్షంగా బెంచ్ లను నిర్ణయించడం, వాటికి న్యాయమూర్తులను కేటాయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయంగా సాగుతున్న న్యాయ పోకడల గురించి ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. కొలిజీయం నిర్ణయాలకు అంతర్జాతీయ న్యాయ వేదికల్లో అత్యంత గౌరవం ఉంటుందని, అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారని, పనిలో పారదర్శకతను పెంచేలా సమన్యాయం జరిగేలా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.