అందమే ఆమెకు శాపం: భర్త, అత్తింటి వేధింపులతో కాల్చేసుకుంది
ఫిలిభిత్: అందంగా ఉండటం, అందరితో కలుపుగోలుగా మాట్లాడటమే ఆ వివాహితకు శాపంగా మారింది. ఆమె కలుపుగోలుతనాన్ని అపార్థం చేసుకున్న భర్త, అత్తామామలు ఆమెను అనుమానిస్తూ సూటిపోటీ మాటలతో వేధింపులకు గురిచేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై నిప్పటించుకుంది.
ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిత్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఫిలిభిత్ ప్రాంతానికి చెందిన రేఖా లోధి(26)కి, నిర్మల్ కుమార్కు 6ఏళ్ల కిందట వివాహం జరిగింది. అయితే రేఖా లోధి అందంగా ఉంటుంది. అంతేగాక, అందరితో చనువుగా మాట్లాడటం, బాగా కలుపుగోలుగా ఉండటం ఆమెకు మొదటి నుంచి అలవాటు.
అయితే అత్తింట్లో ఆమె అలా ఉండటం వల్ల భర్త, మామలు సూటిపోటి మాటలతో ఆమెను వేధించే వారు. 'బాగా అందంగా ఉన్నావ్', అంటూ మాటి మాటికీ రెచ్చగొట్టే విధంగా మాటలు అనే వారు. దీంతో ఓ దశలో వేధింపులను భరించలేని రేఖా లోధి తీవ్ర మనస్థాపానికి లోనైంది.
ఈ క్రమంలో తన అందమే తనకు అడ్డంకిగా, శాపంగా మారిందని ఆమె భావించింది. తన ముఖాన్ని మంటతో కాల్చుకుంది. గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే శరీరం 20 నుంచి 25 శాతం వరకు కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం రేఖా లోధి కోలుకుంటుందని తెలిపారు.
కాగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఒకవేళ బాధితురాలు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని నిందితులపై చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు తెలిపారు.