తైపీలో కూలిన విమానం: పైలట్లు హీరోలే, డాష్ బోర్డ్ వీడియో తీసింది
తైపీ: ట్రాన్స్ ఏషియాకు చెందిన విమానం నదిలో పడిన ఘటనలో 31 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో విమానం పైలట్, కో పైలట్ మృతదేహాలు వెలికితీశారు. ఇంకా పలువురి ఆచీకూ కోసం గాలిస్తున్నారు. 58 మందితో ప్రయాణిస్తున్న విమానం అదుపు తప్పగానే పైలట్ చాకచక్యంతో నష్టనివారణ చర్యలు చేపట్టారని విమానయాన నిపుణులు ప్రశంసిస్తున్నారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో పలు ఆకాశహర్మ్యాలు ఉన్నాయి. వాటికి తాకకుండా విమానాన్ని నది దిశగా మళ్లించడంతో పెను నష్టాన్ని నివారించగలిగినట్లయిందని అంటున్నారు. ప్రమాదం సమయంలో పైలట్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడని, అతను హీరో అంటున్నారు.
కాగా, తైపీ నదిలో విమానం కూలుతుండగా వీడియో తీశారు. అది యూట్యూబ్లో అప్ లోడ్ అయింది. దానిని ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు తిలకిస్తున్నారు. ఈ వీడియోను కారు డాష్ బోర్డు కెమెరా చిత్రీకరించింది. దీంతో ఇది బ్లాక్ బాక్స్లా ఉపయోగపడుతుంది. విదేశాల్లో ఇలా డాష్ బోర్డు కెమెరాలు ఏర్పాటు చేస్తారు.
తైవాన్లో 53 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న ట్రాన్స్ ఏసియా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఒకటి బుధవారం తైపీ విమానాశ్రయంనుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఒక నదిలో కూలిపోయిన విషయం తెలిసిందే.
ట్రాన్స్ ఏసియా ఎయిర్లైన్స్కు చెందిన ఫ్రెంచ్ తయారీ ఎటిఆర్-72 టర్బోప్రాప్ విమానం దేశ రాజధాని తైపీనుంచి దూరంగా ఉన్న కిన్మెన్ దీవికి మధ్య నడుస్తోంది. తైపీలోని సోంఘ్షాన్ విమానాశ్రయంనుంచి ఉదయం 10.45 గంటలకు బయలుదేరిన విమానం 10నిమిషాల తర్వాత కంట్రోల్ టవర్స్తో సంబంధాలు కోల్పోయింది. విమానం నన్హు వంతెనను ఢీకొట్టిన తర్వాత కీలుంగ్ నదిలో కూలిపోయినట్లు తైవాన్కు చెందిన సెంట్రల్ న్యూస్ ఏజన్సీ(సిఎన్ఏ) తెలిపింది.