కేరళలో తీర ప్రాంత గ్రామాల్లో కరోనా సమూహిక వ్యాప్తి: సీఎం విజయన్ వెల్లడి
తిరువనంతపురం: దేశంలో తొలిసారి ఓ రాష్ట్ర ప్రభుత్వం కరోనావైరస్ సమూహ వ్యాప్తి జరుగుతోందంటూ అధికారిక ప్రకటన చేసింది. కేరళ రాజధాని తిరువనంతపురంలో పలు చోట్ల కరోనా సామాజిక వ్యాప్తి మొదలైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ వెల్లడించారు.
ఏపీలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 3963 పాజిటివ్ కేసులు, 52 మంది మృతి, జిల్లాల వారీగా కేసులు
తిరువనంతపురంలోని కొన్ని తీర ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిపారు. పూంథూరా, పుల్లువిలా ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి జరుగుతోందని స్పష్టం చేశారు. పుల్లువిలాలో 91 నమూనాలను పరీక్షించగా.. 57 పాజిటివ్ వచ్చాయి. పూంథూరాలో 50 నమూనాలను పరీక్షించగా 26 పాజిటివ్గా తేలాయన్నారు. .
తీర ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. తిరువనంతపురంలోని తీర ప్రాంతాన్ని మూడు జోన్లుగా విభజించి కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు.
మరోవైపు దేశంలో ఇంతవరకు సామాజిక వ్యాప్తి లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుండటం గమనార్హం. కాగా, కేరళలో కొత్తగా 593 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 11,660కు చేరింది. 6,417 యాక్టివ్ కేసులున్నాయి. 5,198 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడి 41 మంది మరణించారు.
కాగా, దేశంలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 10,46,622 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,63,434 యాక్టివ్ కేసులున్నాయి. ఇక 6,56,444 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు 26,351 మంది కరోనాతో మరణించారు.