కొలంబో విమానాశ్రయానికి తప్పిన ముప్పు.. ఎయిర్పోర్ట్ టర్మినల్లో ఐఈడీ బాంబు గుర్తింపు
కొలంబో : శ్రీలంకలో భద్రతా సిబ్బంధి అప్రమత్తతతో పెనుముప్పు తప్పింది. వరుస పేలుళ్లతో చివురుటాకులా వణికిన కొలంబో నగరం మరో బాంబు పేలుడు ముప్పు నుంచి తప్పించుకుంది .కొలంబో ఎయిర్ పోర్టుకు సమీపంలో శక్తివంతమైన బాంబును గుర్తించిన భద్రతా దళాలు దాన్ని నిర్వీర్యం చేశాయి.
కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మెయిన్ టెర్మినల్ వద్దఅత్యంత ప్రమాదకరమైన ఐఈడీని గుర్తించారు. ఆదివారం పేలుళ్లు జరిగిన నేపథ్యంలో కతునాయకే ఎయిర్పోర్ట్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా అనుమానాస్పద వస్తువులను తనిఖీ చేస్తుండగా.. శ్రీలంక ఎయిర్ ఫోర్స్ సిబ్బంది స్థానికంగా తయారు చేసిన పైప్ బాంబును గుర్తించారు. ఇది పేలి ఉంటే ప్రాణనష్టం మరింత జరిగి ఉండేదని అధికారులు అంటున్నారు.
శ్రీలంకలో అంతకంతకు పెరుగుతున్న మృతులు..చనిపోయిన వారిలో ఐదుగురు భారతీయులు..
ఇదిలా ఉంటే ఎయిర్పోర్టులోని హై సెక్యూరిటీ జోన్లో బాంబు దొరకడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆ ప్రాంతంలో బాంబు ఎవరు పెట్టారన్న అంశంపై దర్యాప్తు ముమ్మరం చేసింది. అధికారులు అక్కడి భద్రతా సిబ్బందిని ప్రశ్నించడంతో పాటు సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. పేలుళ్ల నేపథ్యంలో సెక్యూరిటీ మరింత పెంచినందున ప్రయాణీకులు నాలుగు గంటల ముందు ఎయిర్పోర్టుకు రావాలనిసర్క్యులర్ జారీ చేశారు.