రైల్వే మంత్రి పీయూష్ గోయల్పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన షేర్ల వ్యవహరంలో పీయూష్ గోయల్కు సంబంధించిన ఆధారాలున్నాయని ఆయన చెప్పారు. ఈ విషయమై ఆయన రాజీనామా చేయాలని ట్వీట్ చేశారు.
ఫ్లాష్ నెట్ ఇన్ఫో సొల్యూషన్స్లోని మొత్తం షేర్లను పిరమల్ గ్రూప్నకు ముఖ విలువ కంటే వెయ్యి రెట్ల అధిక మొత్తానికి విక్రయించి గోయల్ అవినీతికి పాల్పడ్డారని రాహుల్ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఇదంతా జరిగిందన్నారు. ఆ రంగంపై పిరమల్ గ్రూపునకు ఆసక్తి కనబరిచిందన్నారు. అవినీతికి పాల్పడిన కారణంగా ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాపైనా విమర్శలు గుప్పించారు. గోయల్ అవినీతికి సంబంధించి ఆధారాలు ఉన్నా మీడియా ఆ వైపు చూడడం లేదన్నారు.
కాగా, ఇదే వ్యవహారంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ వస్తోంది. గోయల్, ఆయన భార్యకు చెందిన మొత్తం షేర్లను రూ.9586 చొప్పున మొత్తం రూ.48 కోట్లకు విక్రయించారని పేర్కొంది. ఇది ముఖ విలువ కంటే వెయ్యి రెట్లు అదనం అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది.