20 మందిని కాపాడి హీరో అయిన పిజ్జా బాయ్
ముంబై: ముంబై నగరంలోని చండివాలి ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదం భారి నుండి 20 మంది ప్రాణాలు రక్షించిన పిజ్జా డెలివరి బాయ్ ని అందరూ అభినందిస్తున్నారు. అతను తన ప్రాణాలను లెక్క చెయ్యకుండా ఇతరులను కాపాడాడని స్థానికులు అంటున్నారు.
శనివారం సాయంత్రం ముంబైలోని చండివాలి ప్రాంతంలోని అంథేరిలో 21 అంతస్తుల లేక్ హోం రెసిడెన్సియల్ కాంప్లెక్స్ (అపార్ట్ మెంట్)లోని 14వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ కాంప్లెక్స్ కు సుమారు 200 మీటర్ల దూరంలోని ఈగల్ బాయ్స్ అనే పిజ్జాలో జితేష్ (21) డెలివరి బాయ్ గా పని చేస్తున్నాడు.
అదే సమయంలో జితేష్ పిజ్జా ఇవ్వడానికి ఆ కాంప్లెక్స్ దగ్గరకు వెళ్లాడు. అప్పటికే మంటలు వ్యాపించి 14వ అంతస్తులోని బాల్కనీ లో నుండి కాపాడాలని గట్టిగా కేకలు వేస్తున్న విషయం గుర్తించాడు. తరువాత అక్కడ ఉన్న సెక్యూరిటిగార్డులు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ లను జితేష్ అలర్ట్ చేశాడు.
వారి సహాయంతో 21 అంతస్తు చేరుకున్నాడు. అక్కడి నుండి ఒక్కొక్కరిని కిందకు తీసుకు వచ్చి వదిలి పెట్టాడు. సుమారు 20 మంది ని కిందకు తీసుకు వచ్చాడు. 20 సార్లు కిందకి పైకి వచ్చి వెళుతున్న జితేష్ తన ప్రాణాలను లెక్క చెయ్యలేదు.
ఆ కాంప్లెక్స్ లో ఉన్న వారిని చాల మందిని కాపాడాడు. ఈ అగ్ని ప్రమాదంలో 7 మంది మరణించి 28 మంది గాయపడ్డారు. ఎక్కువ ప్రాణనష్టం జరగకుండ చూసిన జితేష్ ను స్థానికులతో పాటు పోలీసు అధికారులు అభినందించారు.