'పీకే' పైరసీ: నోరుజారి చిక్కుల్లో పడ్డ సీఎం అఖిలేష్, పీఎస్లో ఫిర్యాదు
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రం విషయంలో చిక్కుల్లో పడ్డారు. పీకే చిత్రాన్ని ఇంటర్నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకొని చూసినట్లు అఖిలేష్ ప్రకటించడం ద్వారా వివాదంలో చిక్కుకున్నారు.
యాంటీ పైరసీ చట్టాన్ని ఉల్లంఘించారంటూ పలువురు సామాజిక కార్యకర్తలు అఖిలేష్ పైన పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం పైరసీని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అయితే, ఘటన పైన ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది.
పీకే చిత్రాన్ని డౌన్ లోడ్ చేసుకునేందుకు లైసెన్స్ పొందినట్లు పేర్కొంది. పీకే చిత్రంపైన విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దల్ కర్యకర్తలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిలేష్ ఆ చిత్రానికి ఉత్తర ప్రదేశ్లో ట్యాక్స్ రద్దు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలామంది తనను చాలా రోజులుగా పీకే చిత్రాన్ని చూడమని కోరుతున్నారని, తాను కొద్ది రోజుల క్రితం దానిని డౌన్లోడ్ చేసుకున్నానని, అయితే, గత రాత్రే తనకు ఆ సినిమా చూసేందుకు సమయం దొరికిందని చెప్పాడు. దీంతో ముఖ్యమంత్రి పైన సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు.
అఖిలేష్ యాదవ్ ప్రకటన నేపథ్యంలో ఎన్జీవో, తాహ్రిర్ (ట్రాన్స్పరెన్సీ, అకౌంటబులిటీ అండ్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ ఫర్ రివొల్యూషన్) వ్యవస్థాపకులు సంజయ్ శర్మ యూపీలోని హజ్రాత్ గంజ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అఖిలేష్ పైరేటెడ్ సినిమా చూసినందుకు అతని పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. సామాజిక సంస్థలు, ప్రముఖులు కొందరు అఖిలేష్ యాదవ్ పైన మండిపడుతున్నారు. దీని పైన ముఖ్యమంత్రి కార్యాలయం రెండు రోజుల క్రితం ట్విట్టర్లో వివరణ ఇచ్చింది.