నాపై దాడి చేయించింది ఆమ్ ఆద్మీ పార్టీయే: కపిల్ మిశ్రా
తనపై దాడి చేయించింది ఆమ్ ఆద్మీ పార్టీయేనని ఢిల్లీ మాజీ మంత్రి కపిల్మిశ్రా ఆరోపించారు. దాడి చేసిన వ్యక్తి ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్ వద్ద పనిచేస్తాడని చెప్పారు.
న్యూఢిల్లీ: తనపై దాడి చేయించింది ఆమ్ ఆద్మీ పార్టీయేనని ఢిల్లీ మాజీ మంత్రి కపిల్మిశ్రా ఆరోపించారు. దాడి చేసిన వ్యక్తి ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్ వద్ద పనిచేస్తాడని చెప్పారు.
ఆప్ నేతల విదేశీ పర్యటనల వివరాలు వెల్లడించాలంటూ నిరాహార దీక్ష చేపట్టిన మిశ్రాపై బుధవారం దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఈ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 'ఇదంతా ఆమ్ఆద్మీ ప్లాన్. దాడి చేసిన వ్యక్తి సత్యేంద్రజైన్ మొహల్లా క్లినిక్ ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు. అతడు పార్టీ కార్యకర్త కూడా' అని చెప్పారు.
అయితే ఘటన జరిగిన తర్వాత పోలీసుల తీరు చాలా ఆశ్చర్యకరంగా ఉందన్నారు. కాగా.. కేజ్రీవాల్పై చేసిన వ్యాఖ్యలపై తన వద్ద ఆధారాలున్నాయని, వీటిని నేడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు మిశ్రా చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఢిల్లీ మాజీ మంత్రి కపిల్ మిశ్రా బుధవారం సత్యాగ్రహం చేపట్టిన విషయం తెలిసిందే. ఆయనపై నిన్న సాయంత్రం దాడి జరిగింది. దీక్షా స్థలం వద్దకు అకస్మాత్తుగా వచ్చిన అంకిత్ భరద్వాజ్ అనే యువకుడు మిశ్రాపై దాడికి దిగాడు.
కేజ్రీవాల్పై నువ్వు చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమంటూ చేయిచేసుకోబోయాడు. దీంతో మిశ్రా మద్దతుదారులు భరద్వాజ్ను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. భరద్వాజ్ బీజేపీకి చెందిన యువ మోర్చా సభ్యుడని ఆమ్ఆద్మీ ఆరోపించింది. దాడి బీజేపీనే చేయించిందని విమర్శలు చేసింది. అయితే ఈ విమర్శలను కపిల్ మిశ్రా వ్యతిరేకించారు. తనపై దాడి చేసింది ఆమ్ ఆద్మీనే అని ఆయన చెప్పడం గమనార్హం.