ఇస్రో టార్గెట్..మంగళ్ యాన్-2: అయిదేళ్ల మామ్ ప్రస్థానం..అంచనాలకు మించి!
Recommended Video
బెంగళూరు: ఎన్నో ఆశలు పెట్టుకున్న చంద్రయాన్ 2 వైఫల్యంతో నిరాశలో కూరుకుపోయిన భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలకు ఓ చిరు ఊరట కలిగించే ఉదంతం ఇది. అంగారకుడి ఆనుపానులను వెలికి తీయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) అయిదేళ్లను పూర్తి చేసుకుంది.. విజయవంతంగా! అంచనాలకు మించి రాణించింది. మరి కొంతకాలం పాటు పనిచేయ దగ్గ శక్తి సామర్థ్యాలను పుణికి పుచ్చుకుంది. గడువు ముగిసిన తరువాత కూడా మార్స్ ఆర్బిటర్ మిషన్ కనీసం మరో ఆరు నెలల పాటు సమర్థవంతంగా పని చేయగలుగుతుందని ఇస్రో ఛైర్మన్ కే శివన్ తెలిపారు.
షాకింగ్: విమానాశ్రయంలో 23 తుపాకులు పట్టివేత: అనుమతుల్లేకుండా విదేశాల నుంచి!
సరిగ్గదా అయిదేళ్ల కిందట..
2013 నవంబర్ 5వ తేదీన మార్స్ ఆర్బిటర్ మిషన్ ను అంతరిక్షంలోకి ప్రయోగించారు. మరుసటి ఏడాది 2014 సెప్టెంబర్ 24వ తేదీన దీన్ని అంగారక గ్రహం కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ అయిదేళ్ల కాలంలో గురు గ్రహం కక్ష్యలో పరిభ్రమిస్తోన్న మామ్.. కీలక సమాచారాన్ని ఫొటోలు, డేటాల రూపంలో ఇస్రో గ్రౌండ్ స్టేషన్ కు పంపించింది. ఇప్పటికీ అది విజయవంతంగా పనిచేస్తోందని ఇస్రో ఛైర్మన్ కే శివన్ తెలిపారు. నిజానికి మామ్ను ఆరు నెలల పాటు మాత్రమే పని చేసేలా రూపొందించారు. నిర్దేశిత గడువు ముగిసినా, మార్స్ ఆర్బిటర్ మిషన్ విశ్రమించలేదు. అలా, అలా అయిదేళ్లను పూర్తి చేసుకోవడం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎలాంటి ఢోకా లేకుండా గురు గ్రహం చుట్టూ అది పరిభ్రమిస్తూనే ఉంది. ఇప్పటిదాకా ఆర్బిటర్ ను గురు గ్రహం కక్ష్యలోనికి విజయవంతంగా ప్రవేశ పెట్టిన దేశాలు మూడే. అమెరికా, రష్యా, యూరోపియన్ అంతరిక్ష సంస్థలు తమ ఆర్బిటర్ ను గురు గ్రహం కక్ష్యలోనికి ప్రవేశపెట్టాయి. ఆ దేశాల సరసన భారత్ నిలిచింది.
మంగళ్ యాన్-2 పై ఇస్రో గురి
మంగళ్ యాన్ మిషన్ విజయవంతం కావడంతో దానికి సీక్వెన్స్ గా మరో ప్రాజెక్టును చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. మంగళ్ యాన్-2 పేరుతో మరో ఆర్బిటర్ ను అంగారక గ్రహంపైకి పంపించడానికి కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని కే శివన్ ధృవీకరించారు. ప్రస్తుతం మంగళ్ యాన్-2కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని, ప్రయోగం ఎప్పుడనేది ఇంకా నిర్ధారించలేదని, దీనికి చాలా సమయం పట్టొచ్చని అన్నారు. మంగళ్ యాన్-2 ప్రాజెక్టును చేపట్టాలనే యోచన ఉందని అన్నారు. మార్స్ మిషన్ నుంచి ఇప్పటిదాకా వేలాది ఫొటోలు అందాయని, రెండు టెర్రాబైట్ల డేటాను ఆర్బిటర్ గ్రౌండ్ స్టేషన్ కు చేరవేసిందని చెప్పారు. అంగారక గ్రహానికి ఫొబోస్, డీమోస్ అనే రెండు చంద్రుళ్లు ఉన్నాయి. అతి సమీపం నుంచి, అత్యధిక రిజల్యూషన్ తో వాటి చిత్రాలను తీసి పంపించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంగారక గ్రహంపై ఒక్కసారి ఇసుక తుఫాను అంటూ చెలరేగితే.. దాని ఉపరితలం నుంచి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తు వరకూ అది దట్టంగా వ్యాపిస్తుందని, దాని వల్లే అక్కడ మానవ నివాసానికి ఉపయుక్తం కాదనే అభిప్రాయం వ్యక్తమౌతున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన ఫొటోలను మార్స్ ఆర్బిటర్ పంపించినట్లు తెలిపారు.
చంద్రయాన్-2తో పోల్చుకుంటే ఖర్చు సగమే..
మార్స్ ఆర్బిటర్ మిషన్ ఇంకో ఆరు నెలలు లేదా ఏడాది పాటు పని చేస్తుందని తాము అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అందులో అమర్చిన పరికరాలు ఎలాంటి లోపాలు లేకుండా సజావుగా పనిచేస్తున్నాయని చెప్పారు. మున్ముందు మరింత కీలక సమాచారం అందుతుందని ఆశిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రాజెక్టు కోసం ఇస్రో చేసిన ఖర్చు 450 కోట్ల రూపాయలు. చంద్రయాన్-2తో పోల్చుకుంటే దీనికైన ఖర్చు సగమే. చంద్రయాన్-2 ప్రాజెక్టు వ్యయం 980 కోట్ల రూపాయలు. అంగారక గ్రహం ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి, వాతావరణంలోని మీథేన్, కార్బన్ డయాక్సైడ్లను విశ్లేషించడానికి, సౌర గాలుల తీవ్రతను పసిగట్టడానికి శాస్త్రవేత్తలు అమర్చిన కొన్ని రకాల పరికరాల వల్లే ఖర్చు కొంతమేర పెరిగిందని వెల్లడించారు.