కరోనా ఎఫెక్ట్: ఎంఎంఆర్ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం ధర భారీగా పెంపు, రూ. 10 కాదు, రూ. 50
ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం, అధికారులు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడే ప్రదేశాలపై ఎక్కువగా దృష్టి సారించారు.
Recommended Video
సెంట్రల్ రైల్వే అధికారులు ప్లాట్ఫాం టికెట్ల ధరలను భారీగా పెంచారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(ఎంఎంఆర్) లోని కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరను రూ. 10 నుంచి ఏకంగా రూ. 50కి పెంచినట్లు ప్రకటించారు.
కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అధిక రద్దీని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్నినస్, దాదర్, లోక్మాన్య తిలక్ టెర్మినస్ తోపాటు పొరుగున ఉన్న థానే, కళ్యాణ్, పాన్వెల్, భీవాండీ రోడ్ స్టేషన్లలో పెంచిన ఈ ధరలు అమలు చేయనున్నట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో శివాజీ సుతార్ తెలిపారు.
కాగా, పెంచిన ప్లాట్ ఫాం టికెట్ ధరలు మార్చి 1 నుంచి జూన్ 15 వరకు అమలులో ఉంటాయని శివాజీ వెల్లడించారు. వేసవిలో ప్రయాణాల సందర్భంగా ఆయా స్టేషన్ల వద్ద అధిక రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో కొత్తగా 7863 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 21,69,330కి చేరింది. తాజాగా, 6332 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 20,36,790కి చేరింది. తాజాగా 54 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 52,238కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 79,093 యాక్టివ్ కేసులున్నాయి.