ఫలితాలకు ముందు పియానో వాయిస్తూ ... మమత వీడియో వైరల్
నేడే తుది తీర్పు వెలువడనుంది. ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల రణరంగంలో హోరాహోరీగా పోరాడారు. బీజేపీ సర్కార్ ను గద్దె దించాలని మమత భావించారు. బీజేపీయేతర కూటమి పక్షాల్లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ను ఒప్పుకోని మమత తానే ప్రధాని పోటీదారునని తేల్చేశారు.
ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ సర్కార్ కు దెబ్బ కొడతాననుకున్న మమత కు ఎగ్జిట్ పోల్స్ షాక్ ఇచ్చాయి. దీంతో టెన్షన్ లో ఉంటుంది అనుకున్న మమతా బెనర్జీ మరికొన్ని గంటల్లో ఫలితాలు వస్తాయనగా హాయిగా పియానో వాయిస్తూ వీడియో పోస్ట్ చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాన్ని పియానోపై ప్లే చేశారు.
నిన్నమొన్నటి వరకు ఎన్నికల సంగ్రామంలో కత్తులు దూసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇప్పుడు పియానో వాయిస్తూ సేద దీరుతున్నారు. తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపధ్యంలో మమతా బెనర్జీ టెన్షన్లో ఉంటారని అంతా భావిస్తే అందుకు భిన్నంగా ఆమె పియానో వాయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తుది విడత ఎన్నికలు, ఫలితాల విడుదలకు మధ్య సమయం దొరకడంతో ఆమె ఇలా రిలీఫయ్యారు. తాను పియానో వాయిస్తున్న వీడియోను ఆమె స్వయంగా తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు. దీనిని 'అమ్మ, మట్టి, మనిషి'కి అంకితమని పేర్కొన్నారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. పోస్టు చేసిన గంటలోనే 4 వేల షేర్లు, వేలాది లైక్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ వీడియోను 5.82 లక్షల మంది వీక్షించారు.