సీజేఐపై అభిశంసన పిటిషన్: తిరస్కరించిన సుప్రీం, తగ్గిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) దీపక్ మిశ్రాను అభిసించాలని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు నోటీసులివ్వగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆ తీర్మానంను తిరస్కరించారు. దీంతో ఉపరాష్ట్రపతి తీర్మానంను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. పలువురు కాంగ్రెస్ ఎంపీలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
కాగా, మంగళవారం ఉదయం విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది. నిబంధనల మేరకు ఉపరాష్ట్రపతి నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడ్డ ధర్మాసనం.. ఈ పిటిషన్పై తదుపరి విచారణ ఉండబోదని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ వినతిని కూడా సుప్రీం తోసిపుచ్చింది. విషయాన్ని పార్లమెంటు వేదికగా తేల్చుకోవాలని సూచించింది. అంతేగాక, మీకు మీరుగా పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీలను ఆదేశించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీలు వేసిన పిటిషన్ ను వారి తరపు లాయర్ కపిల్ సిబల్ వెనక్కి తీసుకున్నారు.
కాగా, నేరుగా రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడంపై సిబల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని చెప్పారు. చీఫ్ జస్టిస్ ఈ కేసును రాజ్యాంగ ధర్మసనానికి బదిలీ చేశారా? అని కపిల్ సిబల్ ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరారు. అయితే, సిబల్ అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. దీంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు కపిల్ సిబల్ ప్రకటించారు.