లైంగికవాంఛ తీరిస్తేనే..: అధికారులకు చెంప ఛెళ్లుమనిపించేలా జవాబు
తిరువనంతపురం: తాను కొనుగోలు చేసిన భూమి వేరే వారి పేరిట ఉండటంతో దాన్ని సరిచేయాలని వెళ్లిన ఓ మహిళకు తీవ్ర పరాభవం ఎదురైంది. తనకు లంచంగా శరీరక సుఖాన్ని ఇవ్వాలని ఓ అధికారి ఆమెను అతినీచంగా వేధించాడు. దీంతో ఆమె అతనికి చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం ఇచ్చింది.
సోమవారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం వరకు కృష్ణవేణి అనే 34ఏళ్ల బాధిత మహిళ తిరువనంతపురంలోని సచివాలయం ముందు నిరసన చేపట్టింది. తన భూమి తనకు దక్కేందుకు తన గ్రామం చిరయంకీజ్కు చెందిన ఓ అధికారికి లంచం ఇవ్వాల్సి ఉందని, ప్రజలు తనకు విరాళంగా డబ్బులు ఇవ్వాలని ఓ ప్ల కార్డుతో ప్రదర్శన దీక్ష చేసింది.
తన కోర్కె తీర్చాలంటూ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె పేర్కొంది. ఇద్దరు అధికారులు తనకు చెందిన భూమిని వేరే వారిపేరిట రాయించేశారని, తన పేరిట రాయమంటే తమ లైంగిక కోర్కెలు తీర్చాలని వేధిస్తున్నారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని కృష్ణవేణి తెలిపింది. జయకుమార్ అనే వ్యక్తి పేరుపై తన భూమి ఉందని, అతడే అధికారులతో రాయించుకున్నాడని తెలిపింది. డిఎస్పీతోపాటు పలువురు పోలీసు అధికారులు కూడా నిందితుడితో కుమ్మక్కై కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారని చెప్పింది. కాగా, ఓ అధికారి తనకు ముద్దివ్వాలని వేధించాడని తెలిపింది.
కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డిఎస్పీ తెలిపారు. ఆమె కావాలనే ఇలా రాజకీయ ప్రోద్బలంతో ఆందోళన చేస్తోందని ఆరోపించారు. తనపై, ఇతర అధికారులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, నాతోపాటు మరికొంత మంది అధికారులను ఇరికించే ప్రయత్నం చేస్తోందని అన్నారు.