"మమతాను హతమార్చేందుకు కుట్ర: అలా ఎందుకు జరిగింది?"
ఇంధన కొరతతో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు పైలట్ విజ్ఞప్తి చేసిన ఏటీసీ పట్టించుకోలేదని ఇదంతా మమతాను హతమార్చేందుకు జరుగుతున్న కుట్ర అని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
కోల్కతా : నోట్ల రద్దు నిర్ణయాన్ని తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన ఆందోళనను ఉద్రుతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం నాడు బీహార్లో నిరసన ర్యాలీని చేపట్టారు మమతా. ర్యాలీ అనంతరం ఓ ప్రైవేటు విమానంలో పాట్నా నుంచి కోల్ కతాకు బయలుదేరారు.
కానీ విమానం మాత్రం సకాలంలో ల్యాండవలేదు. కోల్కతా విమానశ్రయం వద్ద చాలాసేపు గాల్లోనే తిరుగుతూ ఉండిపోయింది. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులు.. మమతా బెనర్జీని హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఏటీసీ నుంచి అనుమతి రాకపోవడం వల్లనే విమానం ల్యాండవలేదని, ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందని, మమతాను హతమార్చేందుకు కుట్ర పన్నుతారని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఫిర్హాద్ హమీక్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఫిర్హాద్ కూడా మమతాతో పాటే బీహార్ నుంచి కోల్ కతాకు విమానంలో వచ్చారు. కోల్కతాకు 180కి.మీల దూరంలొ ఉన్నప్పుడే ఐదు నిమిషాల్లో లో ల్యాండవుతామని చెప్పిన పైలట్.. అరగంటకు గానీ విమానాన్ని ల్యాండ్ చేయలేదని దీంతో మమతాతో పాటు మిగతా ప్రయాణికులంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని ఫిర్హాద్ తెలిపారు. విమానంలో ఇంధనం అయిపోతుందని ఓపక్క పైలట్ చెబుతూనే ఉన్నా.. ఏటీసీ మాత్రం విమానం ల్యాండవడానికి అనుమతి ఇవ్వకపోవడం పట్ల ఫిర్హాద్ అనుమానం వ్యక్తం చేశారు.
ఇదంతా సీఎం మమతాను చంపడానికి జరుగుతున్న కుట్ర తప్ప మరొకటి కాదని ఆయన ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుపై కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తున్నందుకు.. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నందుకు ఆమెను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఫిర్హాద్ ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, విమానం ఎక్కువసేపు గాల్లోనే ఉండడానికి కారణం సాంకేతిక కారణాలేనని విమానశ్రయ అధికారులు తెలిపారు. అంతకుముందు పాట్నాకు సైతం విమానం ఆలస్యంగానే చేరుకుంది. సాయంత్రం6.35గం.లకు రావాల్సిన ఇండిగో విమానం గంట ఆలస్యంగా 7.35గం.లకు పాట్నా విమానశ్రయానికి చేరుకోవడంతో మమతాతో పాటు ప్రయాణికులు కొంత అసౌకర్యానికి లోనయ్యారు.
లోక్సభలో లేవనెత్తిన తృణమూల్ :
మమతాను హతమార్చేందుకు కుట్ర జరుగుతుందన్న అంశాన్ని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు లోక్ సభలోను లేవనెత్తారు. మమతా సహా పలువురు వీఐపీలు ప్రయాణించిన ఆ విమానంలో ఇంధనం తక్కువగా ఉందని.. ఇంధన కొరతతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ పైలట్ విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని టీఎంసీ నేతలు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
మోడీ సర్కార్ ను నిలదీస్తున్నందుకే ఈ కుట్ర జరిగిందని, అందుకే విమానంలో సరిపడినంత ఇంధనాన్ని నింపలేనదని తృణమూల్ ఎంపీలు ఆరోపించారు. దీనికి ప్రధాని మోడీనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సీఎంలకే దేశంలో రక్షణ కరువైపోయిన పరిస్థితి ఉందని అసంత్రుప్తి వ్యక్తం చేశారు. కాగా, తృణమూల్ ఆరోపణలను కేంద్రం కొట్టిపారేసింది. విమానాశ్రయాలు బిజీగా ఉన్నప్పుడు ల్యాండింగ్ లో జాప్యం జరగడం సాధారణమే అని పేర్కొంది.