అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం స్థలం గుర్తించిన ప్రభుత్వం..ఎక్కడో తెలుసా..?
అయోధ్య: సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం స్థలం గుర్తించింది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఏడాది నవంబర్ 9న అయోధ్య బాబ్రీ మసీదు భూవివాదం పై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే.
వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమిని రామ్లల్లాకే చెందుతుందని చెబుతూ అదే సమయంలో బాబ్రీ మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే ఐదెకరాల స్థలంను కేటాయించాలంటూ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ క్రమంలోనే యూపీ సర్కార్ మసీదు నిర్మాణం కోసం స్థలంను గుర్తించడం జరిగింది.
అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం యూపీ సర్కార్ ఐదు ప్లాట్లను గుర్తించింది. మీర్జాపూర్, షంషుద్దీన్ పూర్, చాంద్పూర్లలో స్థలాలను గుర్తించింది. ఇవన్నీ పంచ్కోసి పరికర్మ బయటనే ఉండటం విశేషం. 15 కిలోమీటర్ల పరిసరాల్లో ఉన్న పంచ్కోసి పరికర్మను అత్యంత ప్రవిత్రమైన స్థలంగా భావిస్తారు. అయితే మసీదు నిర్మాణం కోసం బయట స్థలంను కేటాయించడంతో ముస్లింలు కొంత అభ్యతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
అయోధ్య రామమందిర నిర్మాణం ట్రస్టీల ఆధ్వర్యంలో జరగాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముందుగా ట్రస్టీలకు సంబంధించిన బోర్డు ఏర్పాటు అయ్యాకే ఈ ప్లాట్లను సున్నీ వక్ఫ్ బోర్డుకు అందిస్తామని యూపీ సర్కార్ స్పష్టం చేసింది.
1992లో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేయడంతో దేశవ్యాప్తంగా అల్లర్లకు తావిచ్చింది. ఇక అప్పటి నుంచి అయోధ్య వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతోంది. ఎట్టకేలకు నవంబర్ 9వ తేదీన అప్పటి చీఫ్ జస్టిస్ రంజ్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎట్టకేలకు ముగింపు పలికింది.
అయితే సుప్రీంకోర్టు తీర్పును ముందుగా స్వాగతించిన ముస్లిం సంఘాలు ఆ తర్వాత రివ్యూ పిటిషన్ వేయాలని భావించాయి. మొత్తం 18 రివ్యూ పిటిషన్లు వేయగా అన్ని పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం డిసెంబర్ 12న కొట్టివేసింది.