మోడీకి తిరుగులేదు: జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి అనూహ్య ఆదరణ ఉందని మరో సర్వేలో వెల్లడైంది. అప్పుడప్పుడు కొంత తగ్గినప్పటికీ, 2014 నుంచి మోడీ దేశంలోనే అతిపెద్ద ఆకర్షణీయ నేతగా, రాజకీయంగా బలమైన నేతగా పలు సర్వేల్లో వెల్లడైంది. తాజాగా వైయస్ జగన్ పార్టీ వైసీపీ రాజకీయ కార్యకలాపాలు చూస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు చెందిన సంస్థ సర్వేలోను అదే తేలింది.
ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-పాక్) ఆధ్వర్యంలో ఆన్లైన్ సర్వే చేశారు. నేషనల్ అజెండా ఫోరం కింద ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 712 జిల్లాల నుంచి 57 లక్షల మంది పాల్గొన్నారు. 55 రోజులు సాగింది. ఇందులో మోడీకి 48 శాతం ఓట్లు వచ్చాయి. 923 మంది నేతల్లో మోడీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు.
మోడీ దరిదాపుల్లో ఎవరూ లేరు
ప్రధాని నరేంద్ర మోడీకి 48 శాతం ఓట్లు పడితే, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి 11 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. 9.3 శాతం ఓట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడో స్థానంలో ఉన్నారు. 7 శాతం ఓట్లతో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ 4వ స్థానంలో, 4.2 శాతం ఓట్లతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఐదో స్థానంలో, 3.1 ఓట్లతో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరో స్థానంలో ఉన్నారు.
జాబితాలో పలువురు నేతల పేర్లు
సర్వే కోసం ఇచ్చిన జాబితాలో పలువురు నేతల పేర్లు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ గతంలో కలిసి పని చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్తో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరీ, ఎన్సీపీ నేత శరద్ పవార్లతో పాటు పలు ప్రాంతీయ పార్టీల నేతల పేర్లు ఉన్నాయి.
సర్వే వివరాలు విడుదల
మహిళా సాధికారత, వ్యవసయ సంక్షోభం, ఆర్థిక అసమానతలు, విద్యార్థుల సమస్యలు, ఆరోగ్యం, పారిశుద్ద్యం, సామాజిక ఐక్యత, ప్రాథమిక విద్య తదితర అంశాలపై ఈ సర్వే నిర్వహించారు. ఈ జాబితాను సోమవారం విడుదల చేసింది.
ఐపాక్ ఏం చెప్పిందంటే?
కాగా, ఐపాక్ సభ్యులు ఈ సర్వే ఫలితాలపై మరో వివరణ కూడా ఇచ్చారు. దేశంలో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఈ పోల్ నిర్వహించామని తెలిపింది. ఈ సర్వేలో ఆన్ లైన్ యూజర్స్ మాత్రమే పాల్గొన్నారని, దేశవ్యాప్త ప్రజల అభిప్రాయంగా చెప్పలేమని అభిప్రాయపడింది.