ఇరాక్ మృతుల ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
న్యూఢిల్లీ: ఇరాక్లోని మోసూల్లో ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 39 మంది భారతీయుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ నష్టపరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇరాక్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పంజాబ్కు చెందిన కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనకు దిగిన అనంతరం ప్రధాని పరిహారం ప్రకటించారు.
ఇరాక్లో ఉగ్రఘాతుకం: భారత్ చేరిన 38మంది మృతదేహాలు
కాగా, పంజాబ్కు చెందిన బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇంతకుముందే ప్రకటించారు.
విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వీకే సింగ్ స్వయంగా బాగ్దాద్ వెళ్లి.. అక్కడ్నుంచి మృతుల భౌతిక కాయాలను సోమవారం భారత్కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 39 మంది చనిపోగా డీఎన్ఏ నమూనాలు సరిపోలిన 38మంది మృతదేహాలను మాత్రమే భారత్కు తీసుకొచ్చారు.
చనిపోయిన వారంతా 2014లో ఓ ఏజెంట్ ద్వారా అక్రమ మార్గంలో ఇరాక్ వెళ్లి అక్కడ కార్మికులుగా పనిచేశారు. ఉగ్రవాదులు 40 మందిని అపహరించగా ఒక వ్యక్తి మాత్రం తాను బంగ్లాదేశ్ ముస్లింనని చెప్పి తప్పించుకున్నాడు. మిగతా 39మందిని ఉగ్రవాదులు చంపేశారు.