ఆ మోడీలు చేసిన పాపాలకు ప్రధాని మోడీపై విమర్శలా?: రాందేవ్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్( పీఎన్బీ)లో భారీ కుంభకోణానికి పాల్పడ్డ నగల వ్యాపారి నీరవ్ మోడీని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారని యోగా గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. నీరవ్ తాను చేసిన పాపాలకు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేశారు.
అంతేగాక, లలిత్ మోడీ, నీరవ్ మోడీలు తమ సిగ్గుమాలిన చర్యలతో దేశాన్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు మోడీలు చేసిన పనికి ప్రధాని మోడీని నిందించడం సరికాదని బాబా రాందేవ్ అన్నారు.
కాగా, నీరవ్ మోడీ, ఆయన కుటుంబ సభ్యులు, గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సి రూ 15,000 కోట్లు పైగా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని పీఎన్బీ ఫిర్యాదు చేసింది. మరోవైపు నీరవ్ మోడీ ఆయన భార్య అమీ, సోదరుడు నిషాల్, మెహుల్ చోక్సీలపై సీబీఐ కేసులు నమోదు చేసింది.
2011లో మొదలైన ఈ కుంభకోణాన్ని ఈ ఏడాది జనవరి మూడవ వారంలో గుర్తించారు. నీరవ్ మోసాన్ని గుర్తించిన పీఎన్బీ అధికారులు ఈ ఏడాది జనవరి 31న సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐతోపాటు ఐటీ విభాగం, ఈడీ సైతం ఈ కేసుపై దర్యాప్తునకు రంగంలోకి దిగాయి.