పీఎం కేర్స్ ఫండ్... ఐదు రోజుల్లోనే ఎంత విరాళం సమకూరిందో తెలుసా... ఇదిగో రిపోర్ట్...
కరోనాపై పోరు కోసం విరాళాలు సేకరించేందుకు ఈ ఏడాది మార్చి 27న ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్కు ఐదు రోజుల వ్యవధిలోనే రూ.3,076 కోట్లు వచ్చినట్లు పీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రూ.2.25లక్షలతో మొదలైన ఈ నిధికి మార్చి 31 నాటికి రూ.3075.8కోట్లు విరాళం సమకూరిందని... ఇందులో రూ.39.6కోట్లు విదేశీ నిధులు ఉన్నాయని మొదటి ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. అయితే ప్రారంభ విరాళం ఎవరిచ్చారన్నది నివేదికలో పేర్కొనకపోవడం గమనార్హం.
వడ్డీ 35.53లక్షలు...
ఈ ఐదు రోజుల్లో సమకూరిన నిధిపై రూ.35.53లక్షలు వడ్డీ జమ అయినట్లు నివేదికలో తెలిపారు. ఫారెక్స్ కన్వర్షన్పై సర్వీస్ ట్యాక్స్ మినహాయింపులను తీసివేయగా చివరకు రూ.3076.6కోట్లుగా తేలినట్లు చెప్పారు. SARC& అసిసోయేటెడ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఈ లెక్కలను ఆడిట్ చేశారు. నివేదికపై పీఎంవో కార్యాలయ సెక్రటరీ శ్రీకర్ కె ప్రదేశ్,డిప్యూటీ సెక్రటరీ హార్దిక్ షా,అండర్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ,సెక్షన్ ఆఫీసర్ పర్వేష్ కుమార్ సంతకాలు చేశారు.
దాతల వివరాలేవీ : చిదంబరం
పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్(PMNRF) లాగే పీఎం కేర్స్ ఫండ్కి కూడా ఎవరెవరు ఎంత విరాళమిచ్చారన్న వివరాలు వెల్లడించలేదు.దీనిపై మాజీ కేంద్రమంత్రి చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రోజుల్లోనే మూడు వేల పైచిలుకు కోట్ల రూపాయాలు వచ్చాయని చెబుతున్న ప్రభుత్వం... దాతల వివరాలు మాత్రం ఎందుకు వెల్లడించట్లేదని ప్రశ్నించారు. ఒక పరిమితిని దాటి విరాళాలు స్వీకరిస్తే ఏ ఎన్జీవో అయినా లేదా ట్రస్ట్ అయినా విరాళాలు వెల్లడించాల్సిందేనని... దీనికి పీఎం కేర్స్ ఫండ్ మాత్రం ఎందుకు మినహాయింపు అని ప్రశ్నించారు. దాతల పేర్లు వెల్లడించేందుకు ట్రస్ట్ సభ్యులు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.
పీఎం కేర్స్ ఎందుకు...?
ఈ ఏడాది మార్చి 27న ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్కు ప్రధాని నరేంద్ర మోదీ ఛైర్పర్సన్(ఎక్స్-అఫీషియో) వ్యవహరిస్తుండగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా,కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్ అఫీషియో హోదాలో సభ్యులుగా ఉన్నారు. అయితే పీఎం రిలీఫ్ ఫండ్ ఉండగా పీఎం కేర్స్ ఫండ్ను తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బీజేపీ సర్కార్ను ప్రశ్నించింది. అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.10 మైక్రో డొనేషన్స్ కూడా స్వీకరించేందుకే పీఎం కేర్స్ ఫండ్ను తీసుకొచ్చినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. పీఎంవో వెబ్సైట్ ద్వారా వ్యక్తులు లేదా సంస్థలు పీఎం కేర్స్ ఫండ్కు విరాళాలు ఇవ్వవచ్చు.