ఫిబ్రవరి నుంచే రైతులకు కేంద్ర సాయం..!
ఢిల్లీ : దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయం పథకం ఈ నెల నుంచే అమలు కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరిట తెరపైకి తీసుకొచ్చిన ఈ స్కీమ్ ను కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూములున్న రైతులకు ప్రతి సంవత్సరం 6వేల రూపాయలు అందించనుంది కేంద్రం. ఈ పథకం కింద 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరనుంది. పార్లమెంటులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. పీఎం కిసాన్ పథకం అమలుకు 20వేల కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించింది కేంద్రం.
పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఇవ్వనున్న 6వేల రూపాయలను 3 దఫాలుగా చెల్లించనుంది కేంద్రం. అయితే 2018 డిసెంబర్ నుంచే ఈ పథకం వర్తించనుంది. ఆ మేరకు మొదటి దఫా కింద 2వేల రూపాయలు ( డిసెంబర్ విడత ) ఈ నెలలో రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ కానున్నాయనే టాక్ నడుస్తోంది. చిన్న, సన్నకారు రైతులతో పాటు భూముల వివరాలు కూడా కేంద్రం దగ్గర సిద్ధంగా ఉన్నాయని తెలిపారు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్.