పీఎం కిసాన్ పథకం ప్రారంభించిన మోడీ.. రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ
గోరఖ్ పూర్ : రైతుల కోసం ఉద్దేశించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు రైతులకు చెక్కులు కూడా అందించారు. మోడీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ హాజరయ్యారు.
పీఎం కిసాన్ ప్రారంభం
పీఎం కిసాన్ పథకం కింద తొలివిడతగా కోటిమంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ ప్రయోగాత్మకంగా చేపట్టారు. యూపీ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో పాటు మరో 10 రాష్ట్రాలకు చెందిన రైతులకు 2వేల రూపాయల బదిలీ జరగనుంది. మరో మూడు నాలుగురోజుల వ్యవధిలో మరో కోటిమందికి బదిలీ చేయనున్నారు. ఒక్కో రైతుకు కేంద్ర పథకం కింద 6వేల రూపాయలు ఇవ్వనుండగా.. ఇప్పుడు 2వేల రూపాయలు జమ చేస్తున్నారు. మరో 4వేల రూపాయలు రెండు విడతల్లో జమ కానున్నాయి. ఈ స్కీమును ప్రయోగాత్మకంగా ప్రారంభించిన అనంతరం మోడీ వీడియో కాన్ఫరెన్సులో రైతులతో మాట్లాడారు.
తొలి విడత షురూ
ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఆర్థిక సాయం అందించడానికి ఉద్దేశించిన పీఎం కిసాన్ పథకంలో ఓ అడుగు ముందుకు పడింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒక విడత మొత్తానికి సంబంధించి 2వేల రూపాయలను ఆదివారం (24.02.2019) నుంచి డైరెక్ట్ గా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ఇలాగే మూడు విడతలుగా జమ చేయనున్నారు కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు. తెలంగాణలోని 15వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే 3 కోట్ల రూపాయలను కేంద్రం జమచేసింది.
క్రమక్రమంగా నగదు బదిలీ
తెలంగాణకు చెందిన 17.93 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలను ఆధార్ వివరాలతో సహా పీఎం కిసాన్ పోర్టల్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ నమోదు చేసింది. ఇంకా మిగిలిన రైతుల వివరాలు కూడా నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం నాడే ఈ పథకం ప్రారంభం కావడంతో ఒక్కరోజే అందరి ఖాతాల్లోకి జమచేస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే ఛాన్సుంది. దీంతో ప్రతిరోజు సెలెక్టివ్ గా రైతుల ఖాతాల్లోకి ఎమౌంట్ ట్రాన్స్ ఫర్ చేయనున్నారు.