ప్రపంచంలోనే అతిపెద్ద బీమా పథకం: ఆయుష్మాన్ భారత్పై రేపే ప్రధాని మోడీ ప్రకటన?
Recommended Video
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట పైనుంచి చేసే ప్రసంగంలో కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. 'జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం-ఆయుష్మాన్ భారత్'(ఏబీ-ఎన్హెచ్పీఎస్)ను ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈ పథకాన్ని వచ్చే నెల(సెప్టెంబర్) చివరి వారం నుంచి అమలు చేయనున్నట్లు సమాచారం.
50కోట్ల మందికి ప్రయోజనం
దేశంలోని 10కోట్లకు పైగా పేద కుటుంబాలకు ఆరోగ్య భద్రత కింద సంవత్సరానికి రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. గ్రామాల్లో నివసించే 8.03కోట్ల కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే 2.33కోట్ల కుటుంబాలు దీని ద్వారా లబ్ధిని పొందనున్నాయి. ఈ పథకంతో దేశం మొత్తంలో 50కోట్ల మందికి ప్రయోజనాలు అందనున్నాయి.
22 రాష్ట్రాల్లో..
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోడీ చేయనున్న ప్రసంగంలో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రకటించే అవకాశం ఉందని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు. దేశంలోని 22 రాష్ట్రాల్లో త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా..
మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, ఢిల్లీలో ఈ పథకం ప్రారంభంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, ఈ పథకంలో భాగస్వామి కావడానికి ఒడిశా అంగీకరించకపోవడం గమనార్హం. ఆయుష్మాన్ భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు కేటాయించింది. ఈ పథకం అమల్లోకి వస్తే ప్రపంచంలోనే ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద ఆరోగ్య రక్షణ బీమా పథకంగా రికార్డుల్లోకెక్కనుంది.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతోన్న సీజీహెచ్ఎస్ కన్నా ఈ పథకం లబ్ధిదారులు అధిక ప్రయోజనాలు అందుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ కోసం ప్రతి ఆస్పత్రిలో ‘ఆయుష్మాన్ మిత్ర' పేరిట ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన ఈ పథక లబ్ధిదారులు ముందుగా ఆస్పత్రిలోని ‘ఆయుష్మాన్' మిత్ర కౌంటర్ను సంప్రదించి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. కాగా, లబ్ధిదారులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ పథకం ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.