కరోనా లాక్డౌన్..?: మరోసారి మీడియా ముందుకు మోడీ..? పొడిగింపుపై ప్రకటించే ఛాన్స్...
కరోనా వైరస్ మరింత విస్తరించకుండా దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ మంగళవారంతో ముగుస్తోంది. మార్చి 24వ తేదీ నుంచి మూడువారాలు అంటే ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రధాని మోడీ స్పష్టంచేశారు. కానీ దేశంలో వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గలేదు. పాజిటివ్ కేసులు 6 వేలకు చేరడం తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశీతంగా పరిశీలిస్తోంది. అధికారుల నుంచి వివరణ తీసుకుంటున్నది. లాక్ డౌన్ పొడిగించాలని సీఎం కేసీఆర్ మీడియాముఖంగా ప్రధానిని కోరగా.. ఒడిశాలో ఈ నెల 30వ తేదీ వరకు అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది.
Recommended Video
సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్..
ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. ఆ సమావేశలో సీఎంల అభిప్రాయం తీసుకొని లాక్డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయి. మార్చి 23వ తేదీ మాదిరిగా.. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. లాక్ డౌన్ పొడిగింపు సహా కొన్ని రంగాలకు మినహాయింపు ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ మరోసారి మీడియా ముందుకు కూడా వస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఏ రోజు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారనే అంశంపై మాత్రం స్పష్టత లేదు.
మధ్య సీటు ఖాళీ..
రెండో విడత లాక్డౌన్లో కొన్ని ముఖ్య మార్పులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, ప్రార్థన స్థలాలు మూసివేస్తామని సంకేతాలు ఇచ్చింది. సామాజిక దూరం పాటిస్తూనే కొన్నింటికీ అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. లాక్ డౌన వల్ల పరిస్థితిని రిజర్వ్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.. దీంతో కొన్ని రంగాలకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. వైమానిక రంగం కూడా భారీగా నష్టపోయింది. విమాన సేవలను పునరుద్ధరించాలని.. అయితే ప్రతీ విమానంలో గల అన్ని తరగతుల్లో మధ్య సీటు ఖాళీగా ఉంచడంపై సమాలోచనలు చేస్తుంది.
ఎత్తివేయబోం.. కానీ
లాక్ డౌన్ గురించి బుధవారం అఖిలపక్ష నేతలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు లాన్ డౌన్ ఎత్తివేయబోమని చెప్పారు. కొన్నింటికీ మినహాయింపులు ఇస్తామని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. వైరస్ బారి నుంచి ప్రజలను కాపాడటమే తమ ప్రాథమిక విధి అని మోడీ స్పష్టంచేశారు. కరోనా మహమ్మారిపై ఐకమత్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు.