కృష్ణా జలాలపై తీర్పు: భేటీలో చేతులెత్తేసిన ప్రధాని
న్యూఢిల్లీ: కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పుపై తామేమీ చేయలేమని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి చెందిన అఖిలపక్ష ప్రతినిధులతో తేల్చి చెప్పారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో ఇప్పటికే పెండింగ్లో ఉన్న కేసు విషయంలో జా గ్రత్త వహించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు సుదర్శన్ రెడ్డి, జానారెడ్డి, పార్థసారథి, తెలుగుదేశం నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కోడెల శివప్రసాద్, బిజెపి నాయకుడు నాగం జనార్దన్రెడ్డి, సిపిఎం నాయకులు బీవీ రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, సిపిఐ నాయకులు కె నారాయణ, గూండా మల్లేశ్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు వినోద్కుమార్, విద్యాసాగర్ రావు, వైయస్సార్ కాంగ్రెసు నేతలు ఉమ్మా రెడ్డి వెంకటేశ్వర్లు, ఎంవిఎస్ నాగిరెడ్డి, లోక్సత్తా నేత బండారు రామ్మోహన్రావు, మజ్లీస్ నేత అసదుద్దీన్ ఒవైసీలు శుక్రవారం ప్రధానిని ఆయన నివాసంలో కలిశారు.
ట్రిబ్యునల్ తీర్పుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని చెబుతూ వారు ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించే బ్రిజేష్ తీర్పును గెజిట్లో ప్రచురించవద్దని ముఖ్యమంత్రి ప్రధానిని కోరారు. 75 శాతం ఆధారపడదగ్గ జలాల ఆధారంగా నీటిని పంపిణీ చేయాల్సి ఉండగా, 65 శాతాన్నే పరిగణనలోకి తీసుకున్నారని, ఇది జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.
ఈ సమయంలో కేంద్ర జలవనరుల మంత్రి హరీశ్ రావత్ జోక్యం చేసుకుంటూ - ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం ప్రశ్నించలేదని చెప్పారు. అయితే దీనిపై తాను దృష్టి సారించానని ప్రధాని చెప్పారు. అయితే, కేంద్రం కూడా ఈ కేసులో భాగస్వామిగా చేరుతూ పిటిషన్ వేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఇందుకు ప్రధాని సమాధానమిస్తూ - తాను నియమించిన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వమే న్యాయ పోరాటం చేయడం ఇబ్బందిగా ఉంటుందన్నారు. అయితే, ప్రస్తుతం అమల్లో ఉన్న 75 శాతం డిపెండబులిటీకి బదులు 65 శాతాన్ని ప్రామాణికంగా తీసుకున్న అంశం మాత్రం సహేతుకంగా లేదని ప్రధాని చెప్పారు. దీనిపై సిడబ్ల్యుసి చేత అధ్యయనం చేయిస్తానని ప్రధాని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టులో కేసు పరిష్కారమయ్యేలోపు సిడబ్ల్యుసి అధ్యయనం పూర్తవుతుందని చెప్పారు.
ప్రధానితో భేటీకి ముందు అఖిలపక్ష నాయకులకు సీఎం కిరణ్ ఏపీ భవన్లో అల్పాహార విందు ఇచ్చారు. ఇక ఏపీ భవన్లో సీఎంని కేంద్ర మంత్రులు కావూరు, జేడీ శీలం,కృపారాణి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్కుమార్, హర్షకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్ కలిశారు.