ముఖ్యమంత్రులకు మోడీ వార్నింగ్: ఆ చర్యలు తప్పనిసరిగా చేపట్టాల్సిందే: వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన వారితో మాట్లాడుతున్నారు. రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతోన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ భేటీ అయ్యారు. తొలివిడతలో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), విజయ్ రుపాణీ (గుజరాత్), ఉద్ధవ్ థాకరే (మహారాష్ట్ర), అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), భూపేష్ బఘేల్ (ఛత్తీస్గఢ్), మనోహర్ లాల్ ఖట్టర్ (హర్యానా), యోగి ఆదిత్యనాథ్ (ఉత్తర ప్రదేశ్) ముఖ్యమంత్రులు ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని, సెకెండ్ వేవ్ ఏర్పడుతోన్న పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని ప్రధానమంత్రి వారిని హెచ్చరించారు.
కరోనా వైరస్ పాజిటీవ్ కేసుల తీవ్రత క్రమంగా పెరుగుతోందని, నివారించడానికి తక్షణ చర్యలను తీసుకోవాలని అన్నారు. రెండు అడుగుల భౌతిక దూరాన్ని పాటించట్లేదని మోడీ కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, దీన్ని విడనాడాలని అన్నారు. తొలుత- ఢిల్లీ ముఖ్యమంత్రితో మాట్లాడారు. దేశ రాజధానితో కరోనా కట్టడికి తీసుకుంటోన్న చర్యల గురించి ఆయన మోడీకి వివరించారు.
కరోనా బారిన పడిన వారికి మెరుగైన వైద్య చికిత్సను అందిస్తున్నామని, దీనికోసం ఇదివరకు చేపట్టిన చర్యలన్నింటినీ కొనసాగిస్తున్నామని చెప్పారు. మాస్కులను ధరించని వారిపై 2000 రూపాయల జరిమానాను విధిస్తోన్న విషయాన్ని కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.