అడ్డంగా దొరికిన మోదీ - చైనా పేరెత్తడానికి భయమెందుకు?: రాజ్నాథ్ ప్రకటనపై రాహుల్ గాంధీ
చైనాతో సరిహద్దు వివాదంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం పార్లమెంటులో చేసిన ప్రకటనతో ప్రధాని నరేంద్ర మోదీ అడ్డంగా దొరికిపోయారని, భారత భూభాగంలో ఇంచు కూడా ఎవరూ ఆక్రమించలేదన్న ఆయన ప్రకటన అబద్ధమని తేలిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. చైనా దురాక్రమణను తిప్పికొట్టేలా భారత సైన్యానికి మోదీ సర్కార్ అండగా నిలవలేదని, ఇంకా ఎన్నాళ్లిలా చైనా పేరెత్తడానికి కూడా భయపడుతూ ఉంటారని ఆయన నిలదీశారు.
సరిహద్దుల్ని చైనా గుర్తించట్లేదని మీరెలా చెబుతారు? - రాజ్నాథ్ ప్రకటనపై విపక్షం ఫైర్
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం తారా స్థాయికి చేరడం, సైనిక, దౌత్య మార్గాల్లో జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఎల్ఏసీ వెంబడి నెలకొన్న పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో ప్రకటన చేశారు. 1962 యుద్ధం తర్వాత దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, తాజాగా తూర్పు లదాక్ లో 38వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కూడా ఆక్రమించేందుకు యత్నించిందని రాజ్ నాథ్ తెలిపారు. కాగా, దీనిపై చర్చించేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు. సోనియా గాంధీ చికిత్స కోసం ప్రస్తుతం అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ.. రాజ్ నాథ్ ప్రకటనపై ట్విటర్ లో స్పందించారు.
''చైనా ఆక్రమణల విషయంలో ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదారి పట్టించారని రక్షణ మంత్రి ప్రకటనతో తేటతెల్లమైంది. సరిహద్దు సమగ్రత విషయంలో యావత్ దేశం సైన్యానికి ఎల్లప్పుడూ అండగానే ఉంది, ఇకపైనా ఉంటుంది. ఎటొచ్చి మోదీ, ఆయన ప్రభుత్వమే ఇప్పటిదాకా చైనాకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోలేదు. మోదీజీ.. మీరు చైనాకు వ్యతిరేకంగా ఎప్పుడు నిలబడతారు? చైనా ఆక్రమించిన మన భూమిని ఎప్పుడు తిరిగి తీసుకుంటారు? కనీసం చైనా పేరును పలకడానికైనా భయపడకుండా ఉండండి'' అని రాహుల్ పేర్కొన్నారు.
చైనా టెంపర్: కొత్తగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో మోహరింపు - 'చుశూల్’ స్ట్రాటజీతో భారత్
గడిచిన నాలుగు నెలలుగా ఎల్ఏసీ వెంబడి భారీగా మోహరించిన చైనా బలగాలు.. భారత్ ను తరచూ కవ్విస్తుండటం, గాల్వాన్ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో 20 మంది జవాన్లను హత్యచేయడం, ఇటీవల సరిహద్దులో కాల్పులు కూడా చోటుచేసుకోవడం తెలిసిందే. సరిహద్దులను నిర్ధారించే ఎల్ఏసీని చైనా గుర్తించని కారణంగానే వివాదాలు రేగుతున్నాయని, అయినప్పటికీ చర్చలతోనే సమస్యల పరిష్కారానికి భారత్ కృషిచేస్తున్నదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ చెప్పడం వింతగా ఉందని, అలాంటప్పుడు భారత్ స్టేటస్ కో కోసం డిమాండ్ చేయడం అర్థరహితమవుతుందని కాంగ్రెస్ ఎంపీలు అధిర్ రంజన్, శశిథరూర్ లు వ్యాఖ్యానించారు.