Ayodhya:ప్రధాని మోడీ అయోధ్య టూర్ షెడ్యూల్ ఇదే.. ప్రత్యేక ఆహ్వానితుల్లో చిన్నజీయర్ స్వామి
అయోధ్య: చారిత్రాత్మక అయోధ్య రామమందిరంకు బుధవారం ఆగష్టు 5వ తేదీన భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చాలా గ్రాండ్గా నిర్వహిస్తోంది. ప్రధాని మోడీ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొననుండటంతో ఇప్పటికే అయోధ్య నగరం కాషాయం రంగులోకి మారిపోయింది. అయోధ్య నగరం జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తుతోంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య నగరంకు విచ్చేయనున్న సందర్భంగా ఇప్పటికే ఆ నగరం మొత్తం భద్రతాబలగాల చేతిలోకి వెళ్లిపోయింది. బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు చేరుకుంటారు.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం 9:30 గంటలకు లక్నోకు బయలుదేరి వెళతారు. లక్నోకు ప్రధాని మోడీ చేరుకున్నాక... 125 కిలోమీటర్ల దూరంలో ఉండే అయోధ్య నగరానికి హెలికాఫ్టర్లో బయలు దేరి వెళతారు. సరయు నదితీరంలో ఉండే అయోధ్యలోని ఓ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద చాపర్ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి ప్రధాని మోడీ ముందుగా హనుమాన్ గర్హి ఆలయంను సందర్శిస్తారు. అక్కడ 10 నిమిషాల పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి ప్రధాని రామజన్మభూమి వైపు కదులుతారు. ముందుగా రామ్లల్లాకు ప్రత్యేక పూజ చేసి ఆ పై స్టేజ్పైకి వెళతారు. అక్కడే భూమి పూజ నిర్వహిస్తారు. ఇది మధ్యాహ్నం 12:30 గంటలకు జరుగుతుంది.
శ్రీరాముడి ఆలయం నిర్మాణ ప్రారంభంను సూచిస్తూ అక్కడ 40 కేజీల బరువున్న వెండి ఇటుకను ఉంచుతారు. రాముడి ఆలయ నిర్మాణం సందర్భంగా మూడు రోజుల పాటు జరగాల్సిన వేదమంత్రాల పఠనం సోమవారం రోజునే ప్రారంభమైంది. భూమిపూజ కార్యక్రమానికి 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం పంపారు. ఇందులో 135 మంది పూజారులు, ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇప్పటికే అయోధ్యలో 4వేల మంది భద్రతా సిబ్బంది పహారాగా ఉన్నారు. అంతేకాదు 75 చెక్పోస్టులను కూడా అక్కడ ఏర్పాటు చేశారు.
ఇక ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్తో పాటు ఆలయ ట్రస్టు ఛైర్మెన్ గోపాల్ దాస్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి చిన్నజీయర్ స్వామి హాజరుకానున్నట్లు సమాచారం. అయోధ్యలో చిన్నజీయర్ స్వామి ఆశ్రమం నిర్మించనున్నట్లు తెలుస్తోంది. రూ. వెయ్యి కోట్లతో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అక్కడ నిర్మాణం జరగనుంది. ఇక అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటన మూడుగంటల పాటు సాగనుంది. భూమి పూజ కార్యక్రమం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మధ్యాహ్నం 2గంటల5 నిమిషాలకు తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళతారు.