మోదీ మళ్లీ అనేశారు -లోక్సభలో క్లారిటీ ప్రసంగం -ఆందోళనకారులు, ఆందోళన జీవులు వేరన్న ప్రధాని
వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న పోరాటానికి మద్దతిస్తోన్నవాళ్లను 'ఆందోళన జీవులు.. పరాన్నజీవులు..' అంటూ అతితీవ్ర వ్యాఖ్యలతో నిందించిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అవే పదాలను రిపీట్ చేశారు. తన మాటల వెనకున్న అసలైన అర్థాన్ని ప్రజలంతా గుర్తించాలని, ఆందోళనకారులు, ఆందోళన జీవుల మధ్య తేడాను అర్థం చేసుకోవాలని ఆయన కోరారు..
లోక్ సభలో కీలక ప్రసంగం..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు.. ప్రభుత్వం తరఫున సమాధానంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం లోక్ సభలో కీలక ప్రసంగం చేశారు. ఇదే అంశంపై సోమవారం రాజ్యసభలో తాను మాట్లాడిన పాయింట్లనే మరోసారి రిపీట్ చేసిన మోదీ.. వివాదాస్పద పదాలకు లోతైన వివరణ ఇచ్చుకున్నారు. అంతేకాదు, రైతు ఉద్యమం హైజాక్ అయిందని, వ్యవసాయ చట్టాలపై వెల్లువెత్తుతోన్న అనుమానాలన్నీ అర్థంలేనివని ఆయన చెప్పుకొచ్చారు..
వారి మధ్య తేడా తెలుసుకోవాలి..
ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలను ప్రోత్సహిస్తున్నవారిపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ఇటువంటి ఆందోళనలు నిర్వహిస్తున్నవారిని కొత్త జాతికి చెందిన 'ఆందోళన జీవులు'గా అభివర్ణిస్తూ, వారు నిరంతరం ఏదో ఒక ఆందోళనలు చేయకుండా బతకలేరని, అదే సమయంలో దేశంలో కొత్త రకం ఎఫ్డీఐ.. ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ (విదేశీ విధ్వంసక భావజాలం) తయారైందన్న వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ.. ఆందోళన జీవులు, ఆందోళనకారుల మధ్య తేడాను దేశం తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. రైతుల ఆందోళన కార్యక్రమాలు పవిత్రమైనవని, అయితే ఈ పవిత్ర ఆందోళనలను ఆందోళన జీవులు హైజాక్ చేశాయని చెప్పారు.
ధ్వంస రచనకు పేరు ఆందోళనలా?
పవిత్రమైన రైతుల ఉద్యమాన్ని ఆందోళన జీవులు హైజాక్ చేశాయని, తమ ప్రదర్శనల్లో.. తీవ్రమైన నేరాల కేసుల్లో జైలులో ఉన్నవారి ఫొటోలను చూపిస్తున్నారని, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అని ప్రధాని ప్రశ్నించారు. టోల్ ప్లాజాలను పని చేయనివ్వకపోవడం, టెలికాం టవర్లను ధ్వంసం చేయడం పవిత్ర ఆందోళన అవుతుందా? అని నిలదీశారు. 21వ శతాబ్దంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళను 18వ శతాబ్దంనాటి ఆలోచనలతో పరిష్కరించడం సాధ్యం కాదన్న ప్రధాని.. ఈ ఆలోచనా ధోరణిని మార్చాలని స్పష్టం చేశారు. రైతులు ఇతరులపై ఆధాపడవలసిన అవసరం లేకుండా, సొంతగా నిలబడగలిగేలా చేయవలసిన బాధ్యత దేశంపై ఉందన్నారు.
కొత్త చట్టాలతో నిర్బంధం ఉండదు..
''ఎవరు అడిగారని కొత్త చట్టాలు చేస్తున్నారనే వాదననును కొందరు వినిపిస్తున్నారు. ఏ చట్టాలనైనా అంగీకరించడమైనా, తిరస్కరించడమైనా ప్రజల చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయంలో నిర్బంధం ఏమీ లేదు. వరకట్నానికి వ్యతిరేకంగా చట్టం చేయాలని ఎవరూ అడగలేదన్నారు. అయినప్పటికీ దేశం ప్రగతి సాధించడం కోసం ఆ చట్టాన్ని అమల్లోకి తెచ్చాం. ట్రిపుల్ తలాక్, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చట్టాలను దేశాభివృద్ధి కోసమే చేశాం. ఇప్పుడు వ్యవసాయ చట్టాలు కూడా అలాంటివే. ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేటు రంగం కూడా అవసరమే. టెలికాం, ఫార్మా వంటి ఏ రంగాన్ని చూసినా, ప్రైవేటు రంగం పాత్ర మనకు కనిపిస్తోంది. మానవాళికి భారత దేశం సేవలందించగలుగుతోందంటే, దానికి కారణం ప్రైవేటు రంగం కూడా'' అని మోదీ వివరించారు. కాగా, ప్రధాని ప్రసంగం సమయంలో విపక్షాలు వాకౌట్ చేశాయి.
అడ్డంగా దొరికిన జగన్ -పోస్కోతో డీల్ బయటపెట్టిన కేంద్రం -విశాఖ స్టీల్ ప్లాంట్పై టీడీపీ ఫైర్