ముస్లింలను భయపెడుతున్నారు.. పాకిస్తానీలకు పౌరసత్వమిచ్చే దమ్ముందా? గొరిల్లా పాలిటిక్స్ ఆపండి: ప్రధాని
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల భారత పౌరులెవరూ నష్టపోరని, దీనిపై ముస్లింలుగానీ, మరొకరుగానీ ఆందోళన చెందాల్సిన అవసరమేలేదని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి భరోసా ఇచ్చారు. సీఏఏను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళలనపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. చట్టంలో అభ్యంతరాలను పరిశీలించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న ఆయన.. విద్యార్థుల్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బర్హైత్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
పౌరసత్వ సవరణ చట్టంతో ఎవరికీ హానీ కలగదు.. సంయమనం పాటించాలి: ప్రధాని మోడీ
ముస్లింలను భయపెడుతున్నారు..
పౌరసత్వ చట్టంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ అబద్ధాలు చెబుతున్నాయని, ఆ చట్టం అమల్లోకి వస్తే ముస్లింలకు నష్టం జరుగుతుందంటూ లేనిపోని భయాలు పుట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. సీఏఏ వల్ల మన దేశంలో ఏ ఒక్క ముస్లింకి కూడా నష్టంగానీ, హానికానీ జరుగదని భరోసా ఇచ్చారు.
గొరిల్లా పాలిటిక్స్
ముస్లింలను కాంగ్రెస్ భయపెడుతున్న తీరును ‘గొరిల్లా పాలిటిక్స్‘గా అభివర్ణించిన మోదీ.. ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టడం వల్లే జామియా వర్సిటీ, ఇతర ప్రాంతాల్లో హింస చోటుచేసుకుందని చెప్పారు. ‘‘సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తున్న పార్టీలకు నేను సవాల్ విసురుతున్నా.. మీకు దమ్ముంటే పాకిస్తాన్ పౌరులందరికీ భారత పౌరసత్వం ఇస్తామని చెప్పండి.. జమ్మూకాశ్మీర్ లో రద్దయిపోయిన ఆర్టికల్ 370ని మళ్లీ అమలు చేస్తామని అనండి..'' అంటూ మోదీ ఫైరయ్యారు.
విద్యార్థులకు ప్రధాని సూచన
సీఏఏపై లేనిపోని భయాలు ప్రచారం చేస్తున్న పార్టీలను నమ్మి విద్యార్థులు ఆగంకావొద్దని ప్రధాని కోరారు. విద్యార్థుల ముసుగులో అర్బన్ నక్సలైట్లు, సంఘవిద్రోహ శక్తులు హింసకు పాల్పడుతాయని, స్టూడెంట్ల భుజాలమీదుగా తుపాకి పేల్చేందుకు ప్రయత్నిస్తాయని, విద్రోహ శక్తుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు.