కరోనా విలయం: మోదీ కీలక సందేశం.. మరో 5 నెలలు ‘గరీబ్ కల్యాణ్’.. 2.0లో జర భద్రం.. చైనాపై మౌనం
కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ పథకాన్ని మరో మరో 5 నెలల పాటు.. అంటే, నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా ఉచితంగా రేషన్ అందించనున్నట్లు వెల్లడించారు. ఇందు కోసం రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. భారత్-చైనా మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణంపై ప్రధాని మాట్లాడతారాని దేశ ప్రజలు భావించారు. అయితే దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు అక్టోబర్ నవంబర్ నెల మధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో నవంబర్ నెల వరకు ఈ పథకాన్ని పొడిగించడానికి కారణమైఉంటుందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
అన్ లాక్ 2.0లోకి..
‘‘కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతూ మనం అన్ లాక్ 2.0లోకి ప్రవేశించాం. ఇది జలుబు, జర్వరాలు పుట్టించే సీజన్ కూడా. కాబట్టి మనందరం మరింత జాగ్రత్త వహించాలి. సమయానుకూలంగా లాక్ డౌన్ విధించడం ద్వారా లక్షల మంది ప్రజల ప్రాణాలు కాపాడాం. అయితే, అన్ లాక్ 1.0 తర్వాత వ్యక్తిగత, సామాజికంగా నిర్లక్క్ష్ం పెరుగుతూ వచ్చింది. అప్పట్లో మాస్కుల వాడకం, సోషల్ డిస్టెన్సింగ్ నియమాలు, చేతులు కడుక్కోవడం, శానిటైజర్స్ వాడకాన్ని విధిగా పాటించేవాళ్లం. కానీ.. ఎక్కువ జాగ్రత్తలు పాటించాల్సిన సమయంలో వాటన్నింటినీ మర్చిపోయాం. లాక్ డౌన్ సమయంలో పాటించిన నియమాలను మెల్లగా మర్చిపోయే స్థితి. కాబట్టి మనం మళ్లీ ఆనాటి జాగ్రత్తలవైపు దృష్టిపెట్టాల్సిన అవసరముంది.
దండన తప్పదు..
మరీ విశేషంగా కంటైన్మెంట్ జోన్లపై శ్రద్ధ మరింత అవసరం. ఎవరైనా సరే నియమాలు పాటించకుంటే వాళ్లను దండించైనా సరే దారిలోకి తెచ్చుకోవాల్సిందే. మీరు వార్తల్లో చూసే ఉంటారు. కరోనా వేళ మాస్క్ ధరించకుండా పబ్లిక్ ప్లేస్ కు వెళ్లినందుకు ఓ దేశ ప్రధానిపై 13 వేల రూపాయల జరిమాన విధించారు. మన దగ్గర కూడా స్థానిక నేతలు ఇలాంటి స్ఫూర్తితోనే పనిచేయాలి. 130 కోట్ల మందిని కాపాడుకోడానికి మార్గం ఇదొక్కటే. ప్రధాని నుంచి గ్రామ ప్రధాన్ వరకు అందరికీ రూల్స్ ఒక్కటే. నిజానికి కరోనా మరణాల్లో మన దేశం మిగతా దేశాలకంటే మెరుగైన స్థితిలో ఉంది.
పేదలకు ఎన్నో చేస్తున్నాం..
లాక్ డౌన్ సమయంలో పని కోల్పోయిన పేదలు పస్తులు ఉండరాదన్న ఉద్దేశంతో కేంద్రం, రాష్ట్రాలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారు. దేశంగానీ, వ్యక్తిగానీ సమయానికి అనుకూలంగా, సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే అవకాశం ఏర్పడుతుంది. ఆ క్రమంలోనే భారత ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా పేదలకు 2లక్షల కోట్ల రూపాయాల ప్యాకేజీ అందించాం. గడిచిన 3 నెలల్లో దేశంలోని 20 కోట్ల పేద కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 41వేల కోట్ల రూపాయలు జమ చేశాం. అలాగే, 9 కోట్ల మంది రైతులకు 18వేల కోట్లు పంపిణీ చేశాం. గ్రామాల్లో ఉపాధి కల్పనకు ప్రధానమంత్రి రోజ్ గార్ పథకాన్ని విస్తృతం చేశాం. దానిపై 50వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు.
చైనాపై మౌనం..
భారత్ చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు ఇంకా తగ్గకపోవడం, కొన్ని గంటల కిందటే చైనాకు చెందిన 59 యాప్ లపై కేంద్రం నిషేధం విధించిన దరిమిలా జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో ప్రధాని ఏం చెబుతారనేదానిపై ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. తన 17 నిమిషాల ప్రసంగంలో మోదీ ఒక్కసారి కూడా చైనా ప్రస్తావన తేలేదు. అసలు సరిహద్దు గొడవల అంశాన్నే ప్రస్తావించలేదు. ‘గరీబ్ కల్యాణ్ యోజన' పథకం గడువు పెంపుపైనే ప్రధానంగా దృష్టిసారించారు. కరోనా తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా ‘ఆత్మనిర్భర్' పిలుపునిచ్చిన ప్రధాని మోదీ.. స్వదేశీ ఉత్పత్తులు, సేవలే మేలని వక్కాణిస్తున్న సంగతి తెలిసిందే.