పొగమంచు: మోడీ హెలికాప్టర్ ల్యాండింగ్ సమస్య, ఫోన్ ద్వారా సభలో ప్రసంగం
తీవ్ర పొగమంచు కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు ల్యాండింగ్ సమస్య తలెత్తడంతో ఆయన ఫోన్ ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
న్యూఢిల్లీ: తీవ్ర పొగమంచు కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు ల్యాండింగ్ సమస్య తలెత్తింది. మోడీ భారతీయ జనతా పార్టీ పరివర్తన్ యాత్రలో ప్రసంగించాల్సి ఉంది. కానీ చాపర్ ల్యాండ్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో ఆయన ఫోన్ ద్వారా ప్రసంగించారు.
ఆ ఫోన్ను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సభలో ఉన్న లౌడ్ స్పీకర్ల వద్ద పెట్టి ప్రజలకు వినిపించారు. ఢిల్లీతో సహా యూపీలో ప్రధాని మోడీ పర్యటించే ప్రాంతంలోను భారీగా పొగమంచు ఏర్పడింది. దీంతో మోడీ చాపర్ కిందకు దిగలేకపోయింది.
మోడీ ఉత్తర ప్రదేశ్ బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్యకు ఫోన్ చేశారు. తాను మొబైల్ ఫోన్ ద్వారా కార్యకర్తలకు సందేశం ఇస్తానని చెప్పారు. ఇదే విషయాన్ని కార్యకర్తలకు కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. వాతావరణం అనుకూలించినా ప్రధాని రావడానికి ప్రయత్నిస్తారని తెలిపారు. మోడీ ఫోన్ ద్వారా ప్రసంగిస్తుండగా ఆ ఫోన్ను లౌడ్ స్పీకర్ వద్ద పెట్టి వినిపించారు.
కాగా, దేశ రాజధాని సహా ఉత్తరాది రాష్ట్రాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. ఢిల్లీలో మంచు విపరీతంగా కురుస్తోంది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించాల్సిన 90 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
మరో 28 రైళ్ల వేళల్లో మార్పు చేశారు. 4 రైళ్లను రద్దు చేశారు. మరోవైపు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్న ఎనిమిది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు కారణంగా 4 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు.