ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో మోడీ, అమిత్ షా, ధోవల్: విమానాశ్రయాలపై ఫిదాయీన్ల దాడులు: అనుమానాస్పద లేఖ
Recommended Video
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ ను స్వయం ప్రతిపత్తి రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత పాకిస్తాన్ సహా, ఉగ్రవాదుల టార్గెట్ మొత్తం భారత్ మీదే ఉంది. అప్పటిదాకా స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా కొనసాగుతూ వచ్చిన జమ్మూ కాశ్మీర్ భారత్ లో విలీనం అయ్యేలా ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని పాకిస్తాన్ గానీ, ఆ దేశాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకున్న ఉగ్రవాద సంస్థలు గానీ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి.
అందుకే అవకాశం కోసం కాచ్చుకుని కూర్చున్నాయి. భారత్ లో ఉగ్రదాడులు సృష్టించడానికి, వీలైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ను తమ హిట్ లిస్ట్ లోకి చేర్చాయి.
పాక్ అణ్వాయుధ తయారీ కేంద్రంలో ఏం జరుగుతోంది?: ముప్పు తప్పదంటోన్న నిపుణులు!
30 నగరాల్లో పేలుళ్లకు కుట్ర..
జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరు మీద పౌర విమానయాన మంత్రిత్వశాఖ భధ్రతా విభాగానికి ఓ లేఖ అందింది. విమానాశ్రయాలతో పాటు భారత్ లోని 30 నగరాల మీద దాడులకు సిద్ధపడబోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను ఎవరు రాశారు? ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ లేఖ అందిన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ జమ్మూ, పఠాన్ కోట్, అమృత్ సర్, జైపూర్, గాంధీనగర్, కాన్పూర్, లక్నో, వారణాసి, హిండన్ వంటి నగరాల్లో విమానాశ్రయాల భద్రతను కట్టుదిట్టం చేసింది. మరిన్ని పారా మిలటరీ బలగాలతో విమానాశ్రయాల వద్ద బందోబస్తును రెట్టింపు చేసింది. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఆత్మాహూతి దాడికి పాల్పడిన జైషె మహమ్మద్ ఉగ్రవాదులు మరోసారి అదే తరహాలో విరుచుకు పడవచ్చని ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు.
లష్కరే తొయిబా గురి కూడా భారత్ మీదే..
పాకిస్తాన్ నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తోన్న మరో ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు ఇదివరకే ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని దిల్ షుక్ నగర్ లో బాంబు పేలుడుకు పాల్పడింది ఈ సంస్థకు చెందిన ఉగ్రవాదులే. నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తోన్న వారణాసిని లక్ష్యంగా చేసుకుని లష్కరే తొయిబా ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చంటూ హెచ్చరించారు. ఫలితంగా- దేశవ్యాప్తంగా.. ప్రత్యేకించి తీర ప్రాంత పట్టణాలు, పాకిస్తాన్ తో సరిహద్దులను పంచుకుంటున్న ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేసింది కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోడీ, అమిత్ షా పాల్గొనే బహిరంగ సభలపై డేగకన్ను వేసింది. హర్యానా, మహారాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వారిద్దరూ విస్తృతంగా పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో- వారిద్దరి భద్రతను మరింత పెంచారు.
పంజాబ్ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా మారణాయుధాలు..
పంజాబ్ లోని సరిహద్దు గ్రామాల్లో అనుమానాస్పద స్థితిలో భారీ ఎత్తున మారణాయుధాలను కనుగొన్నారు భద్రతా బలగాలు. పాకిస్తాన్ భూభాగంపై నుంచి వాటిని పంజాబ్ సరిహద్దుల్లోకి విసిరేసినట్లు గుర్తించారు. వాటిని ఎవరి కోసం విసిరేశారనేది ఇంకా తేలాల్సి ఉంది. శక్తిమంతమైన గ్రెనేడ్లు సహా సరిహద్దు గ్రామాల్లో భారీ ఎత్తున మారణాయుధాలను దొరికిన విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. రక్షణ మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. దీనిపై ఆ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. సరిహద్దుల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు తనకు దృష్టికి వచ్చాయని, భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని ఆక్ష్న హామీ ఇచ్చారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలంటూ ఇదివరకే బీఎస్ఎఫ్ జవాన్లకు సూచనలు జారీ చేశామని అన్నారు.