మూడు ప్రాజెక్టులను కలిసి ప్రారంభించిన ప్రధాని మోడీ షేక్ హసీనా
న్యూఢిల్లీ: భారత్ బంగ్లాదేశ్ల మధ్య స్నేహం మరింత బలోపేతం కానుంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత ప్రధాని నరేంద్ర మోడీతో శనివారం భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం భారత్ బంగ్లాదేశ్లు పలు ఒప్పందాలపై సంతాకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్రమోడీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలు కలిసి మూడు ప్రాజెక్టులను ప్రారంభించారు.
బంగ్లాదేశ్ నుంచి భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నీటి వనరులు, యువజన వ్యవహారాలు, సంస్కృతి, విద్య, తీరప్రాంతాలపై నిఘా అంశాల్లో ఇరు నేతలు చర్చించారు. అనంతరం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భారత్ బంగ్లాదేశ్ల మధ్య పరస్పర సహకారం అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ రోజు జరిగిన చర్చలతో భవిష్యత్తులో మరిన్ని స్నేహ పూర్వక ఒప్పందాలకు దారి తీస్తుందని తాను భావిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా చెప్పారు.
గత ఏడాది కాలంలో భారత్-బంగ్లాదేశ్లు మొత్తం 12 ప్రాజెక్టులను ప్రారంభించాయని ప్రధాని మోడీ చెప్పారు. భారత్ బంగ్లాదేశ్లు మంచి సంబంధాలు కలిగి ఉన్నాయని చెప్పేందుకు ఇదే నిదర్శనమని మోడీ చెప్పారు. తీరప్రాంత గస్తీ, అణుశక్తి , వాణిజ్య రంగాల్లో భారత్ బంగ్లాదేశ్లు కలిసి ప్రయాణించడం శుభపరిణామం అని బంగ్లా ప్రధాని షేక్ హసీనా అన్నారు. అంతకుముందు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయ్యారు. భారత్కు బంగ్లాదేశ్ ఎప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆమె చెప్పినట్లు జైశంకర్ ట్వీట్ చేశారు.
నాలుగు రోజుల భారత పర్యటన కోసం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా న్యూఢిల్లీకి చేరుకున్నారు. గురువారం జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆమె పాల్గొన్నారు. బంగ్లాదేశ్ మరియు భారత్లలో పార్లమెంటు ఎన్నికలు జరిగాక ఆమె భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. గత కొన్నేళ్లుగా భారత్ బంగ్లాదేశ్ల మధ్య అనుబంధం చక్కటి వాతావరణంలో బలోపేతం అవుతూ వస్తోంది.