కొన్ని గంటల్లో..చారిత్రాత్మక పథకానికి శ్రీకారం! రైతు ఖాతాల్లో నిధులు జమ
గోరఖ్పూర్ః మరి కొన్ని గంటలు! కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న పథకం ఆరంభం కానుంది. వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకుని రాగలదని భావిస్తోన్న కీలక పథకం అది. అదే- కిసాన్ సమ్మాన్ నిధి. ఆర్థిక సంవత్సరంతో సంబంధం లేకుండా.. కొన్ని రోజుల వ్యవధిలోనే కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలులోకి తెస్తామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించింది. దీనికి అవసరమైన బడ్జెట్ను కేటాయించింది.దీనికి అనుగుణంగా ఈ పథకం కింద అర్హులైన రైతులకు చెల్లించడానికి 75 వేల కోట్ల రూపాయలను కేంద్ర ఆర్థికశాఖ మంజూరు చేసింది.
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. గోరఖ్పూర్లో ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించబోయే బహిరంగ సభలో ప్రధాని ఈ పథకాన్ని ప్రకటించబోతున్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా అయిదు ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు కేంద్రప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఏటా 6000 రూపాయలను చెల్లిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలోమూడు విడతలుగా ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ఒక్కో త్రైమాసికంలో 2000 రూపాయల చొప్పున మొత్తాన్ని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
12 కోట్ల మంది రైతులు..తొలి విడత కోటి మంది
దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులు ఈ పథకం కిందికి వస్తారని కేంద్రం అంచనా వేసింది. ఈ పథకం ప్రారంభమైన వెంటనే.. కోటి మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 2000 రూపాయలు జమ అవుతాయి. దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ పూర్తి చేసింది కేంద్రం. అర్హులైన రైతుల ఎంపిక కూడా పూర్తయింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ పోర్టల్ ను కూడా ప్రారంభించింది. అర్హులైన రైతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకే ఈ పోర్టల్ ద్వారా కేంద్రానికి అందజేశాయి. వాటి ఆధారంగా కేంద్రం నిధులను బదిలీ చేయనుంది. తొలిదశలో కోటి మంది, మలి దశలో మిగిలిన రైతుల ఖాతాల్లో మరో వారం రోజుల్లోగా ఈ మొత్తం జమ అవుతుంది. గత ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి తెచ్చినట్టుగా కేంద్రం చూపిస్తోంది. అందుకే 2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన 2000 రూపాయల బకాయిలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు చెబుతోంది.