రూ.1000 కోట్ల తక్షణ సాయం: బెంగాల్ను ఆదుకుంటాం, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మోడీ ఏరియల్ సర్వే..
పశ్చిమబెంగాల్పై అంఫాన్ తుఫాన్ పెను ప్రభావం చూపింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు. తర్వాత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఆపత్కాలంలో బెంగాల్ ప్రభుత్వానికి అండగా ఉంటామని.. తక్షణ సాయం కింద వెయ్యి కోట్ల అందజేస్తున్నామని ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు 3 నెలల తర్వాత మోడీ ఇతర రాష్ట్రంలో పర్యటించారు.
Recommended Video
అంతకుముందు ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. కోల్ కతాకు 50 కిలోమీటర్ల దూరంలో గల బసిర్హట్ వద్ద గవర్నర్ జగ్ దీప్ ధాన్ కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతం పలికారు. అక్కడినుంచి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తర్వాత పాఠశాలలోనే మోడీ రివ్యూ నిర్వహించారు. తుఫాను ప్రభావంతో 80 మంది చనిపోయారని, చాలా మంది ఇల్లు కోల్పోయారని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
బెంగాల్తో కలిసి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ఆపన్నహస్తం అందిస్తోందని మోడీ పేర్కొన్నారు. పునరావాసం, పునర్నిర్మాణం కోసం పాటుపడతామని చెప్పారు. తుఫాన్ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని మమతా బెనర్జీ కోరగా... దానిపై మోడీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
తుఫాన్ కన్నా ముందు కరోనా వైరస్ కోసం బెంగాల్కు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదు అని దీదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. కానీ గురువారం మాత్రం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని మమతా బెనర్జీ.. ప్రధాని మోడీని కోరారు. దీంతో శుక్రవారం మోడీ పర్యటించారు. అయితే రూ.వెయ్యి కోట్ల సాయం తక్షణ సాయం అని.. నష్టాన్ని అంచనా వేసి మిగతా సాయం ప్రకటిస్తామని సంకేతాలు ఇచ్చారు. తుఫాన్ ప్రభావంతో చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల సాయం, గాయపడ్డవారికి రూ.50 వేల అందజేస్తామని మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే.