కాంగ్రెస్ అగ్గి రాజేస్తోంది.. పౌరసత్వ సవరణ బిల్లుతో ఎలాంటి ప్రమాదం లేదు: ప్రధాని మోడీ
ధన్బాద్: పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాలు, ప్రజలు తమ నిరసన తెలిపేందుకు రోడ్డెక్కారు. అయితే పౌరసత్వ సవరణ బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్రాలకు ఎలాంటి హాని కలగదని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రజలు సంయమనం పాటించాలని చెప్పారు. పౌరసత్వ సవరణ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయాలకు, భాషకు, సంస్కృతులకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు.
ప్రజల్లోకి కాంగ్రెస్ తప్పుడు సంకేతాలు పంపుతోంది
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని చెప్పారు. పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపి వారిలో తెలియని గందరగోళం క్రియేట్ చేస్తోందని ప్రధాని మోడీ మండిపడ్డారు. జార్ఖండ్ రాష్ట్రంలో ధనబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ను టార్గెట్ చేశారు ప్రధాని మోడీ. ఈశాన్య రాష్ట్రాల్లో అగ్గిరాజేసేందుకు విపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. చాలా ప్రాంతాలపై ఈ బిల్లు ప్రభావం ఉండదని తెలిసి కూడా కాంగ్రెస్ వాటి మిత్ర పక్షాలు అగ్గిని రాజేసే ప్రయత్నం చేస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు.
బీజేపీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తోంది
బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని గుర్తు చేశారు ప్రధాని మోడీ. కొన్ని దశాబ్దాలుగా ఉన్న అయోధ్య సమస్యను పరిష్కరిస్తామని చెప్పామని ఇప్పుడు అది జరిగిందని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్ కావాలనే నిలిపివేయాలని పలుమార్లు ప్రయత్నించిందని మోడీ ఆరోపించారు. ఇప్పుడు అయోధ్యలో రామాలయం నిర్మాణంకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని మోడీ చెప్పారు. బీజేపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది కాబట్టే ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు.
ఈశాన్యంలో మిన్నంటుతున్న ఆందోళనలు
ఇక పౌరసత్వ సవరణ బిల్లుపై గత కొద్దిరోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికే నిరవధిక కర్ఫ్యూ విధించడం జరిగింది. గౌహతిలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బుధవారం నుంచి గౌహతి నగరం ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోయింది. అక్కడ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేయడం జరిగింది. రైల్వే స్టేషన్కు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. అస్సాంలో రెండు నగరాల్లో పలు కార్యాలయాలను ధ్వసం చేశారు. దీంతో పలు రైళ్లు రద్దు అయ్యాయి. విమాన సర్వీసులను కూడా నిలిపివేయడం జరిగింది.
అస్సాంకు ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీలు
ఇక అస్సాంకు చెందిన బీజేపీ ఎంపీలను తమ రాష్ట్రాలకు పంపడం జరిగింది. అక్కడ సభలు సమావేశాలు పెట్టి బిల్లు యొక్క ఉద్దేశంను ప్రజలకు వివరించాలని బీజేపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎంపీలు అస్సాంకు వెళ్లిపోయారు. అస్సాం నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తుండగా మరో 9 మంది బీజేపీ ఎంపీలు లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోవైపు ప్రజలు సంయమనం పాటించి శాంతియుతంగా ఉండాలంటూ అస్సాం సీఎం సోనోవాల్ శరబానంద్ పిలుపునిచ్చారు.