జమిలి ఎన్నికలకే మోడీ మొగ్గు: ఎన్డీఏ నేతలతో భేటీ, బాబును అడిగిచెప్తామన్న సుజన
న్యూఢిల్లీ/అమరావతి: జమిలి(ఏకకాలంలో పార్లమెంట్, అసెంబ్లీ) ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన వాతావరణం ఏర్పాటుకు సిద్ధం కావాలని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ పక్షాలను కోరారు. మిత్ర పక్షాల నేతలతో సోమవారం సమావేశమైన సందర్భంగా ప్రధాని ఈ మేరకు నేతలను కోరారని ఎన్డీఏ వర్గాలు పేర్కొన్నాయి.
భేటీ సందర్భంగా దావోస్ వేదికపై ప్రధాని మోడీ స్ఫూర్తివంతంగా ప్రసంగించారని కొనియాడుతూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
జమ్మిలి ఎన్నికలకే మోడీ మొగ్గు
అనంతరం జమిలి ఎన్నికలపై చర్చలు చేపడుతూ ఇందుకు అనువైన వాతావరణాన్ని తీసుకురావాలని ప్రధాని కోరినట్టు ఈ సమావేశానికి హాజరైన ఓ నేత వెల్లడించారు. తరచూ ఎన్నికలు ఎదురవుతుండటంతో అభివృద్ధికి ఆటంకమే కాకుండా భారీ వ్యయం వెచ్చించాల్సి వస్తోందని ఏకకాల ఎన్నికలే దీనికి పరిష్కారమని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారని ఆయన వివరించారు.
పార్లమెంట్ సమావేశాలతో పాటు ఆయా పార్లమెంటరీ కమిటీ సమావేశాలకు సభ్యులు విధిగా హాజరుకావాలని ప్రధాని కోరారని చెప్పారు.
బాబును అడిగి చెప్తాం
కాగా, జమిలి ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని అడిగి టీడీపీ వైఖరి చెబుతామని కేంద్ర మంత్రి సుజానా చౌదరీ తెలిపారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో ఎన్డీఏ పక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ తరపున కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ తోట నరసింహం పాల్గొన్నారు.
జమిలిపై అడిగారు
సమావేశం అనంతరం సుజానా చౌదరీ మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్ధిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల గురించి ఎన్డీఏ పక్ష సమావేశం లో చర్చించామని చెప్పారు. జమిలి ఎన్నికలపై సలహాలు అడిగారని, ఆ విషయం గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో సంప్రదించి చెబుతామన్నారు.
విభజన చట్టం అమలుపై
విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై భారత ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి చర్చించాల్సిన అంశాలున్నాయన్నారు. అమిత్ షా సమయం ఇచ్చాక కలిసి విభజన అంశాలు చర్చిస్తామని చెప్పారు. మిత్రపక్ష ధర్మాన్ని ఎలా పాటించడంపై అమిత్ షాతో చర్చిస్తామన్నారు. సంయమనంతో ఉండమని టీడీపీ నాయకులకు చంద్రబాబు సూచించారని, బీజేపీ నాయకులకు కూడా వారి అధిష్టానం సూచించాలని సుజనా అభిప్రాయపడ్డారు.