చంద్రయాన్ -2 ..ప్రకాశవంతమైన భవిష్యత్ కోసం భారత్ మీకు అండగా ..ఆత్మ స్థైర్యం నింపిన మోడీ ప్రసంగం
Recommended Video
భారత శాస్త్రవేత్తలు చివరి నిమిషం వరకు పోరాడి చంద్రయాన్-2 చివరి ఘట్టంలో "విక్రమ్ ల్యాండర్" కమ్యూనికేషన్ తెగిపోవడంతో ఒకింత నిరాశకు గురైన ప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం శాస్త్రవేత్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. చంద్రయాన్-2 ప్రయోగం పై శాస్త్రవేత్తలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వెయ్యాల్సిన అవసరం ఉందని చంద్రయాన్-2 ప్రయోగంపై ఇస్రో నుండి ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇక భారత శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం పై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ.
గొప్ప విజయాలు సాధించాలని అనుకున్నప్పుడు, ఇలాంటి అడ్డంకులు వస్తూనే ఉంటాయన్న ఆయన.. వాటిని ధైర్యంగా అధిగమించి పోరాటం సాగించాలని శాస్త్రవేత్తల్లో ఆత్మస్థైర్యం నింపారు. ఇస్రో కంట్రోల్ సెంటర్ నుండి ప్రసంగించిన ప్రధాని మోదీ... ఈ ప్రయోగం కోసం నిద్రాహారాలు మాని పనిచేసిన ప్రతీ శాస్త్రవేత్తనూ అభినందించారు. శాస్త్రవేత్తల ఆవేదనను అర్థం చేసుకోగలనన్న ఆయన చంద్రయాన్ 2 కోసం శాస్త్రవేత్తలు పడిన ప్రయాస దేశ ప్రజలు అర్థం చేసుకోగలరని అన్నారు. భవిష్యత్తులో ఎవరైనా చంద్రయాన్ గురించి రాస్తే, ఎవరూ ఫెయిలైందని రాయరన్న మోదీ చివరి క్షణం వరకూ చందమామను చేరుకోవడానికి ప్రయత్నించారనే రాస్తారని అన్నారు. ఆ కృషి శాస్త్రవేత్తలు చేశారని అభినందించారు .
అంతలా శాస్త్రవేత్తల కృషి తాను చూశానని, దేశం మొత్తం చూసిందని మోడీ కితాబిచ్చారు .భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయన్న మోదీ ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మరిన్ని లక్ష్యాల్ని సాధించాల్సి ఉందన్న ఆయన భవిష్యత్తులో శుభపరిణామాల కోసం కృషి చేయాలన్నారు. శాస్త్రవేత్తలు సంతోషించే మరిన్ని విజయాలు భవిష్యత్తులో వస్తాయన్న మోదీ, తరువాతి ప్రయోగంలో తప్పక మరింత ఉత్తమ ఫలితాలు సాధిస్తామన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల్ని చూసి దేశం గర్విస్తోందని మోడీ పేర్కొన్నారు. ఇప్పటివరకూ జరిగిన జర్నీ ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. చంద్రమండల యాత్ర కొనసాగుతుందన్న ఆయన మరింత ప్రకాశవంతమైన భవిష్యత్తును చూస్తామని ధీమా వ్యక్తం చేశారు.