అలాంటి వారికే వందేమాతరం అనే హక్కు ఉంది: ప్రధాని మోడీ
వివేకానంద స్వామి చికాగో ప్రసంగానికి 125 ఏళ్లు అయిన సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీ విజ్ఞాన్ భవన్ నుంచి యువ భారత్, నవభారత్ పేరుతో సోమవారం మాట్లాడారు. వివేకానంద స్ఫూర్తితో అందరం ముందుకు సాగాలన్నారు.
న్యూఢిల్లీ: వివేకానంద స్వామి చికాగో ప్రసంగానికి 125 ఏళ్లు అయిన సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీ విజ్ఞాన్ భవన్ నుంచి యువ భారత్, నవభారత్ పేరుతో సోమవారం మాట్లాడారు. వివేకానంద స్ఫూర్తితో అందరం ముందుకు సాగాలన్నారు.
నిత్య జీవితంలో పరిశుభ్రత ముఖ్యమైన భాగమని మోడీ అన్నారు. అందుకే దేవాలయాల కన్నా ముందు మరుగుదొడ్లు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు సెప్టెంబర్ 11. అంటే 2001లో అమెరికాపై దాడులు జరిగిన రోజు అన్నారు.
అయితే అంతకన్నా ముందు సెప్టెంబర్ 11 అంటే మనకు వివేకానందుడు గుర్తుకు వస్తారన్నారు. 1893లో ఇదే రోజున స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగించారని, సామాజిక రుగ్మతల గురించి వివరించారన్నారు.
ఆ రోజు ప్రసంగించిన వాళ్లంతా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటే ఒక్క వివేకానంద మాత్రమే సోదరసోదరీమణులారా అని ప్రసంగించారని గుర్తు చేశారు. ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు భారత్ గొప్పదనం గురించి మాట్లాడారన్నారు.
అదే స్వదేశంలో ప్రసంగించినప్పుడు స్థానిక సమస్యలను ఎత్తిచూపారన్నారు. సంప్రదాయాలు, ఆచారాలు మాత్రమే మనుషుల బంధాలను కలపవని, మానవసేవే మాధవ సేవ అని చెప్పారన్నారు.
ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్పై మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. మన ఆరోగ్యం ఖరీదైన డాక్టర్ల చేతిలో ఉండదని, పారిశుద్ధ్య కార్మికులే మన ఆరోగ్యానికి కారణమన్నారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచినవారే భరతమాతకు నిజమైన బిడ్డలన్నారు.
దేశాన్ని ప్రక్షాళన చేయాలని భావించే ప్రతి ఒక్కరూ భరతమాత ముద్దు బిడ్డలే అన్నారు. వాళ్లకు మాత్రమే వందేమాతరం అని నినదించే హక్కు ఉందన్నారు. చెత్త పడేసి వందేమాతరం అంటే ఎలాగని ప్రశ్నించారు.